లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతుండగా ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌధరి అన్నారు. ఓటర్లు ఆవేశంతో కాకుండా ప్రేమతో ఆర్ఎల్డీ-ఎస్పీ కూటమికి మద్దతుగా ఓటు వేయాలని కోరారు. ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని యువత, రైతాంగం కసితో ఈవీఎం బటన్స్ను నొక్కుతున్నట్టు కనిపిస్తోందని..మీరు ఆర్ఎల్డీ-ఎస్పీ కూటమికి ప్రేమతో ఓటు వేయండని జయంత్ గురువారం ఓటర్లను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరోవైపు జయంత్ చౌధరి మధురలో ఓటు హక్కు వినియోగించుకోకపోవడంపై కాషాయ పార్టీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు.
మధురలో ఓటు వేయడం బౌతికంగా తనకు సాధ్యమయ్యే పనికాదని జయంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు. ఎన్నికల ర్యాలీతో బిజీగా ఉండి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయకుండా ఉండటం చూస్తుంటే జయంత్ ఎంతటి బాధ్యతారహితంగా ఉన్నారో తెలుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. జయంత్ ఎలాంటి సందేశం పంపుతున్నారని ప్రశ్నించారు. గెలుపుపై ఆశలు వదులుకునే ఇలా వ్యవహరిస్తున్నారా అని అమిత్ మాలవీయ సందేహం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం షమ్లి, ముజఫర్నగర్, భాగ్పట్, మీరట్, ఘజియాబాద్, హపూర్, గౌతం బుద్ధనగర్, బులంద్షహర్, అలీఘఢ్, మధురా, ఆగ్రా జిల్లాల్లో తొలి దశ పోలింగ్ జరుగుతోంది.
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ పావులు కదుపుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్తో కాంగ్రెస్ ఉనికిపాట్లు పడుతుండగా..దళితులు, అణగారిన వర్గాల ఆసరాతో ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇవ్వాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ చెమటోడుస్తోంది.