వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఊహించినదానికంటే వేగంగా రికవరీ అవుతున్నాడు. వెన్నునొప్పి వేధించడంతో బుమ్రాకు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని గతంలో వార్తలు వచ్చాయి. కానీ బుమ్రా మాత్రం త్వరగానే కోలుకుంటున్నాడని, ప్రస్తుతం అతడి ప్రోగ్రెస్ బాగుందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) వర్గాలు తెలిపాయి.
ఆసియా కప్ కంటే ముందు ఇంగ్లండ్తో టెస్టు, వన్డే, టీ20లు ఆడిన బుమ్రా వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనల నుంచి తప్పుకున్నాడు. అయితే ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించడానికి కొద్దిరోజుల ముందు బుమ్రా వెన్నునొప్పి కారణంగా తప్పుకున్నాడు. గాయం పెద్దదే అని.. అతడు రెండు నెలల పాటు గ్రౌండ్లో అడుగుపెట్టడం అతడికే ప్రమాదమని వైద్యులు సూచించినట్టు వార్తలు వచ్చాయి.
కానీ వారం రోజులపాటు ఎన్సీఏలో గడిపిన బుమ్రా.. ఊహించినదానికంటే వేగంగా కోలుకుంటున్నాడు. దీంతో అతడు బెంగళూరులోని ఎన్సీఏ నుంచి తన స్వస్థలం ముంబైకి మకాం మార్చాడు. ప్రస్తుతం ఇంటివద్దే విరామం తీసుకుంటున్న బుమ్రా.. పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తే అక్టోబర్లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కంటే ముందే భారత్లో జరగాల్సి ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్లు ఆడే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. ‘బుమ్రా అనుకున్నదానికంటే త్వరగా రికవరీ అవుతున్నాడు. మేము ఎన్సీఏతో పాటు అతడి వ్యక్తిగత వైద్య సిబ్బందితో కూడా నిత్యం టచ్లో ఉన్నాం. ఆస్ట్రేలియా సిరీస్లో అతడు ఆడతాడనన్న నమ్మకం మాకుంది. టీ20 ప్రపంచకప్ వరకు బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకుంటాడు. అయితే ఇలా ఇప్పుడే చెప్పడం అతిశయెక్తి అవుతుంది..’ అని తెలిపాడు.