జనగామ, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)/దేవరుప్పుల/లింగాలఘనపురం/కొడకండ్ల : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూర్యాపేట నుంచి జనగామకు వెళ్తూ దేవరుప్పుల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆగుతారన్న వార్తతో జనగామ జిల్లా వ్యాప్తంగా రైతులు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి అడుగడుగునా తీవ్ర నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు బండి సంజయ్ వస్తే నిలదీసేందుకు సమాయత్తమయ్యారు. బండి పర్యటన జిల్లాలో మొదలు కాకముందే ఆందోళనలకు దిగారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనేలా కేంద్రంతో అధికారికంగా ప్రకటన చేయించే దాక ‘మా ప్రాంతానికి రావద్దు’ అంటూ నల్లజెండాలతో పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొడకండ్ల మండలం మొండ్రాయి, దేవరుప్పుల మండలం మన్పహాడ్, దేవరుప్పుల, ధరావత్తండా, సింగరాజుపల్లి, లింగాలఘనపురం మండలం వనపర్తిలో వందలాది మంది రైతులు, మహిళలు పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకోలు చేశారు. ‘బండి సంజయ్ గోబ్యాక్’ అంటూ నినాదాలతో హోరెత్తించగా, వారికి టీఆర్ఎస్ శ్రేణులు మద్దతు పలకడంతో సూర్యాపేట హైవేలో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నుంచి మొండ్రాయి వద్ద జనగామ జిల్లాలో ప్రవేశించి సూర్యాపేట హైవేలో పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పుల మండలంలో మన్పహాడ్, దేవరుప్పుల, ధరావత్తండా, సింగరాజుపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేలా తొలుత ఖరారైన బండి పర్యటన, రైతుల నిరసనల సెగతో రద్దయింది. మరోపక్క సంజయ్ బ్యాచ్ గూండాలు సైతం ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలపై కంకర రాళ్లతో దాడి చేసేందుకు కుట్ర పన్నారని పసిగట్టిన పోలీసులు దాడులు జరిగితే అమాయక రైతులు ఇబ్బందులు పడుతారని అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దారు. పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించి బందోబస్తు కల్పించాయి. ఇక వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి స్వయంగా మొండ్రాయిలో మకాంవేసి పరిస్థితులను సమీక్షించి ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలపై బండి సంజయ్తో ఫోన్లో మాట్లాడారు.
అత్యవసర సమావేశం రద్దు..
రైతు యాత్ర సందర్భంగా నెలకొన్న పరిస్థితులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ కోసం మంగళవారం రాత్రి జనగామలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసుకున్న బీజేపీ రాష్ట్ర పదాధికారుల అత్యవసర సమావేశాన్ని సైతం పార్టీ రద్దు చేసుకుంది. ఇందులో పాల్గొనేందుకు జనగామకు వచ్చిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఈ పరిణామాల నేపథ్యంలో వెనుదిరిగారు. జిల్లాలో రైతు యాత్రను రద్దు చేసుకొని కాన్వాయ్ని ఎక్కడా ఆపకుండా నేరుగా జనగామ వెళ్తానని సంజయ్ పోలీసులతో పట్టుబట్టినా రాత్రి పొద్దుపోయే వరకు రోడ్లపై పెద్దఎత్తున కాచుకొని ఉన్న రైతుల నుంచి ఎటు నుంచైనా నిరసనలు ఎదురై పరిస్థితి చేయిదాటుతుందన్న పోలీసు అధికారుల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలగిరి నుంచి బండి రూటు మార్చుకొని హైదరాబాద్ తిరుగుముఖం పట్టినట్లు తెలిసింది.లింగాలఘనపురంలో నిర్వహించిన ఆందోళనలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్గౌడ్, ఇన్చార్జిలు బొల్లంపెల్లి నాగేందర్, విండో అధ్యక్షులు మల్గ శ్రీశైలం, ఉపేందర్గౌడ్, ఆంజనేయులు గౌడ్, ఉపేందర్, మధు, గంగాధర్ పాల్గొనగా, సీఐ వినయ్కుమార్, లింగాలఘనపురం, రఘునాథపల్లి ఎస్ఐలు దేవేందర్, రాజేశ్నాయక్ బందోబస్తు కల్పించారు. కొడకండ్ల మండలం గిర్ని తండా క్రాస్రోడ్ వద్ద జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, నలుగురు ఏసీపీలు, 30మంది ఎస్ఐలు, సెంట్రల్ ఫోర్స్తో పాటు ఇతర పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.