ఢిల్లీ ,జూన్ 23:టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెంషెట్ జీ టాటా గడిచిన వందేండ్లలో ప్రపంచంలోనే అత్యంత పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చినట్లు హరూన్, ఎడెల్గేవ్ ఫౌండేషన్ల నివేదికలో వెల్లడైంది. గడిచిన శతాబ్దానికి సంబంధించిన విరాళాలపై హరూన్,ఎడెల్గేవ్ ఫౌండేషన్లు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయం తేలింది. టాటా గ్రూప్ ప్రారంభం నుంచే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తాజాగా ఈ నివేదిక స్పష్టం చేసింది. గడిచిన శతాబ్ద కాలంలో పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు ‘జెంషెట్ జీ టాటా’ 102 బిలియన్ డాలర్లను సేవాకార్యక్రమాలకు వినియోగించినట్లు తెలిపింది.
ఈ మొత్తం ప్రపంచంలోనే అత్యధిక విరాళమని హరూన్, ఎడెల్గేవ్ ఫౌండేషన్లు తమ నివేదికలో తెలిపాయి. గడిచిన శతాబ్దానికి సంబంధించిన విరాళాలపై ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా జెంషెట్జీ టాటా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ టాప్-50 జాబితాలో 37 మంది ఇప్పటికే మరణించగా13 మంది మాత్రమే జీవించి ఉన్నారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, ఆయన నుంచి విడాకులు తీసుకోనున్న సతీమణి మెలిందా కలిపి 74.6 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. దీనితో వీరు ప్రపంచంలోనే అత్యధిక విరాళాలు ఇచ్చిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ 37.4 బిలియన్ డాలర్ల వితరణతో మూడో స్థానంలో నిలిచారు. జార్జ్ సోరస్ 34.8 బిలియన్ డాలర్లు, జాన్ డీ రాక్ఫెల్లర్ 26,8 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చి వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నారు.
ఈ జాబీతాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ. ప్రేమ్జీ 22 బిలియన్ డాలర్లు వితరణ చేసినట్లు నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఉన్న వారిలో 38 మంది అమెరికాకు చెందిన వారు.యూకేకు చెందిన వారు 5 మంది, ముగ్గురు చైనీయులు ఇందులో ఉన్నారు. మొత్తం టాప్ 50 మంది కలిసి గత శతాబ్దంలో 832 బిలియన్ డాలర్ల సేవాకార్యక్రమాలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. తమ ఫౌండేషన్ల ద్వారా, విరాళాల రూపంలో ఈ మొత్తం ఇచ్చినట్లు తెలిపింది.