చెన్నై: జల్లికట్టులో పాల్గొనే ఎద్దుతో బలవంతంగా బతికున్న కోడిని తినిపించారు. (Jallikattu Bull Being Fed Live Rooster) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జంతు హక్కుల కార్యకర్త ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. యూట్యూబర్పై కేసు నమోదు చేశారు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పొంగల్ పండుగ నేపథ్యంలో తమిళనాడులో ప్రతిఏటా జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే ఎద్దులకు వాటి యజమానులు ప్రత్యేక ఆహారం తినిపిస్తారు.
కాగా, చిన్నప్పంపట్టికి చెందిన కొందరు వ్యక్తులు జల్లికట్టులో పాల్గొనే ఎద్దుకు బలవంతంగా బతికున్న కోడిని తినిపించారు. తొలుత పచ్చి మాంసాన్ని దానికి పెట్టారు. అనంతరం బతికున్న కోడిని ఎద్దు నోటిలో పెట్టి నమిలించారు. యూట్యూబర్ రఘు ఈ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.
మరోవైపు జంతు హక్కుల సంఘం కార్యకర్త, పీపుల్ ఫర్ క్యాటిల్ ఎయిమ్ ఇండియా వ్యవస్థాపకుడు అరుణ్ ప్రసన్న దీనిపై స్పందించారు. శాకాహార జంతువైన ఎద్దుతో బలవంతంగా మాంసం, బతికున్న కోడిని తినిపించడం దారుణమని అన్నారు. మాంసాహారం తిన్న ఎద్దు ఒకవేళ జల్లికట్టులో గెలిస్తే మిగతా పశువుల యజమానులు ఈ పద్ధతిని అనుసరించే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూట్యూబర్ రఘుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.