పొట్ట జలగలు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో మొక్కలకు అంటుకొని ఉంటాయి. ఆ మొక్కలను ఆహారంగా తీసుకున్నప్పుడు, జలగలు కూడా జీవాల పొట్టలోకి చేరుతాయి.
లక్షణాలు : పొట్ట జలగలు చేరిన జీవాలు భరించలేని దుర్వాసనతో కూడిన విరేచనాలు చేసుకొంటాయి. వాటి గొంతు కింద నీరు చేరినట్లు వాపు వస్తుంది. ఆకలి మందగించి, నీరసంగా తయారవుతాయి. సరిగ్గా మేత మేయకపోవడంతో బరువు తగ్గుతాయి.
వ్యాధి గుర్తింపు : జీవాల పేడ పరీక్ష ద్వారా పొట్ట జలగల వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స : పశువైద్యుల సూచనలు పాటిస్తూ, పొట్ట జలగల నివారణకు చికిత్స అందించాలి.
జీవాల బరువును బట్టి ఆక్సీక్లోజనైడ్ వాడాల్సి ఉంటుంది. కిలో బరువుకు 15 మి.గ్రా. చొప్పున ఆక్సీక్లోజనైడ్ మందును రెండు రోజులు ఇవ్వడం వల్ల చిన్న జలగలను తొలగించవచ్చు. లేదా కిలో బరువుకు 100 మి.గ్రా. చొప్పున నిక్లోజమైడ్ మందును ఒక్కసారి ఇవ్వాలి. నీరసాన్ని తగ్గించేందుకు గ్లూకోస్ స్లైన్లను ఎక్కించాలి. ఎలెక్ట్రోలైట్ పౌడర్ను నీటిలో కలిపి, రోజుకు మూడుసార్లు తాగించాలి. ప్యురోసమైడ్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల గొంతు కింది వాపును తగ్గించవచ్చు. ఒకవేళ జీవాల్లో రక్తలోపం ఉంటే, ఐరన్ కలిగిన ఫెరిటాస్ ఇంజక్షన్లు ఇప్పించాలి. బెల్లం పాకాన్ని రోజుకు మూడు సార్లు తాగించినా, రక్తలోపాన్ని
అరికట్టవచ్చు.
జాగ్రత్తలు : వరద వచ్చిన ప్రాంతాల్లో జలగలు మొక్కలను అతుక్కుని ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో జీవాలను మేపకపోవడమే మంచిది. నత్తలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనూ జీవాలను మేపవద్దు.