Pet Registration : రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur) లో పెంపుడు జంతువులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (JMC) కీలక ఆదేశాలు జారీచేసింది. ఇకపై ప్రతి పెంపుడు కుక్క, పిల్లికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని స్పష్టంచేసింది. ఇందుకు సెప్టెంబర్ 30 ని గడువుగా నిర్ణయించింది. ఈలోగా తమ పెంపుడు జంతువులను రిజిస్టర్ చేసుకోని యజమానులపై రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
నగరవాసులకు సౌలభ్యం కల్పించేందుకు రెండు నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చినట్టు జేఎంసీ తెలిపింది. ఈ కొత్త విధానంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఓం కసేరా మాట్లాడుతూ.. “జైపూర్ను రేబిస్ రహిత నగరంగా మార్చడం, పెంపుడు జంతువుల సంక్షేమాన్ని బలోపేతం చేయడం, నగరంలోని పెంపుడు జంతువుల పూర్తి డేటాబేస్ రూపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి జంతువు వ్యాక్సినేషన్, ఆరోగ్య వివరాలను నమోదు చేయడం ద్వారా రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు. అలాగే యజమానులలో బాధ్యత పెరుగుతుంది” అని తెలిపారు.
యజమానులను ప్రోత్సహించేందుకు ఆగస్టు 2న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నగరంలో అతిపెద్ద ‘పెట్ కార్నివాల్’ నిర్వహించనున్నట్టు కార్పొరేషన్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో అక్కడికక్కడే రిజిస్ట్రేషన్, ఉచిత యాంటీ-రేబిస్ వ్యాక్సినేషన్, పశువైద్యులతో ఆరోగ్య పరీక్షలు, జంతువుల దత్తత సేవలు అందుబాటులో ఉంటాయి. పెంపుడు జంతువుల యజమానులకు అవసరమైన అన్ని సేవలను ఒకేచోట అందించడమే దీని లక్ష్యం.
కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి పెంపుడు కుక్క, పిల్లికి మూడు నెలల వయసులో మొదటి యాంటీ-రేబిస్ వ్యాక్సిన్, ఆ తర్వాత ఏటా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలి. ఈ వివరాలను రిజిస్ట్రేషన్ రికార్డులలో నమోదు చేస్తారు. జరిమానాలు విధించడం కంటే ప్రజారోగ్యం, జంతు సంక్షేమాన్ని మెరుగుపరచడమే తమ ఉద్దేశమని, ప్రతి ఒక్కరూ గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కమిషనర్ కోరారు.
ఈ నిబంధనలను పెట్ షాపులు, బ్రీడర్లు, కెన్నెల్ నిర్వాహకులకు కూడా వర్తింపజేశారు. వీరంతా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జంతువులను విక్రయించే ముందే మున్సిపల్ కార్పొరేషన్లో రిజిస్టర్ చేయించాలి. మూడు నెలల లోపు వయసున్న కుక్కపిల్లలు లేదా పిల్లిపిల్లల విషయంలో వాటికి సరైన వయసులో వ్యాక్సిన్ వేయిస్తామని కొనుగోలుదారుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలి.
అలాగే ప్రతి మూడు నెలలకోసారి అమ్మిన, కొన్న జంతువుల వివరాలను కార్పొరేషన్కు సమర్పించాలి. రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1,000 ప్లస్ జీఎస్టీగా, వార్షిక రెన్యూవల్ ఫీజును రూ.500 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. ఇతర నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.2,000 జరిమానా ఉంటుంది. అధికారులు పట్టుకున్న కుక్కలకు రోజుకు రూ.100 చొప్పున నిర్వహణ ఛార్జీ వసూలు చేస్తారు.