ధర్మపురి, మార్చి 30: ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక పాత టీటీడీ కల్యాణ మండపంలో రైస్ మిలర్లు, ఆర్యవైశ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం మంగళవారం కొనసాగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 5వేల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఆర్యవైశ్య మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సేవలందించారు. బుధవారం సాయంత్రం 4గంటలకు శ్రీలక్ష్మీ నర్సింహ స్వామివారి ఉత్తర దిగ్యాత్ర, రాత్రి 7గంటలకు బోగ మండప ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవాయంలోని శేషప్ప కళా వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సద్గురు త్యాగరాజు సంగీత ఆరాధనోత్సవాలు నిర్వహించారు. పద్మాసిని, మంజుల, రేవతి, శ్వేత, శివప్రియ త్యాగరాజ పంచరత్న గానం అలరించింది.