Senior citizens | జగిత్యాల మే 5 : సీనియర్ సిటీజన్లకు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన వయో వృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన అంశాల గోడ పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే సోమవారం ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ సేవలను గుర్తించి గత కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాతో మాట్లాడి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉన్న శిథిలావస్థకు చేరిన ఒక గదిని మంజూరు చేయించి నిధులు మంజూరు చేయించానన్నారు. జిల్లాలో సీనియర్ సిటీజన్స్ కేసులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సత్వరం పరిష్కరిస్తున్న జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ను, సీనియర్ సిటీజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తదితర సంఘ ప్రతినిధులను అభినందించారు.
అనంతరం సీనియర్ సిటీజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ సిటీజన్స్ కు ప్రత్యేకముగా ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేయించాలని, తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టంలో 2019 లో కేంద్రం చేసిన సవరణలను పార్లమెంట్ లో ఆమోదించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని తదితర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఎమ్మెల్యే కు విన్నవించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షుడు పీ హన్మంత రెడ్డి, నాయకులు దిండిగాల విఠల్, వెల్ముల ప్రభాకర్ రావు, ఎండీ యాకూబ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ, మాజీ కౌన్సిలర్లు పంబాల రాం కుమార్, క్యాదాసు నవీన్, కూసరి అనిల్ కుమార్, బద్దం జగన్ తదితరులు పాల్గొన్నారు.