జడ్చర్ల టౌన్, నవంబర్ 15 : జడ్చర్లలో సమగ్రాభివృద్ధికి పాటుపడ్డామని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు విద్యానగర్కాలనీ, పద్మావతికాలనీ, ఆల్మాస్కాలనీవాసులతో ఎమ్మెల్యే సమావేశాన్ని నిర్వహించారు. పదేండ్లలో జడ్చర్లలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. కరెంటు, నీళ్ల కష్టాలు తీరాయని, గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేశామన్నారు. కేవలం ఎన్నికలప్పుడు వచ్చే కాంగ్రెసోళ్లను నమ్మొద్దని, వారు చేసేదేవీలేదని తేల్చిచెప్పారు. పనిచేసే వారిని గెలిపించి జడ్చర్ల పట్టణంలో మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా కాలనీవాసులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని సత్కరించారు. జడ్చర్ల అభివృద్ధికి పాటుపడుతున్న లక్ష్మారెడ్డికి మా మద్దతు అంటూ ఆయా కాలనీల ప్రజలు తెలిపారు.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వాల్మీకినగర్, శ్రీరాంనగర్, శాంతినగర్, శివాజీనగర్, సర్దార్ వల్లబాయ్పటేల్ నగర్కాలనీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామని చెబుతూ మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను అందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే సౌభాగ్యలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ప్రతినెలా రూ.3వేలు అందిస్తామన్నారు. తెల్లరేషన్కార్డు ఉన్నవారికి రూ.5లక్షల బీమాతోపాటు సన్నబియ్యం ఇస్తామన్నారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్, అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.