బెంగళూరు: దేశ ప్రయోజనాల కోసం లౌకిక ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే మంచిదేనని జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘లౌకిక భావజాలం గల ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే బాగుంటుంది. ఇందులో కాంగ్రెస్ కూడా ఉంటే మంచిది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ ఈ రోజు దాని పరిస్థితి ప్రాంతీయ పార్టీలాగే మారిపోయింది’ అని పేర్కొన్నారు. గతంలో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తాను ప్రయత్నించానని గుర్తుచేశారు. ఇక దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్నదని, ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే పంజాబ్లో ఓటమికి కారణమని దేవెగౌడ అభిప్రాయపడ్డారు.