వరుసగా రెండో వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సాహక ద్రవ్యపరపతి విధానం, ఒమిక్రాన్ భయాలు తగ్గుముఖం పట్టడం, గ్లోబల్ మార్కెట్ల ర్యాలీ వంటి అంశాలు మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ను పెంచాయి. ఈ క్రమంలోనే గత వారం ప్రధాన సూచీ నిఫ్టీ 1.8 శాతం పెరిగి 17,511 వద్ద ముగిసింది. వీక్లీ డెరివేటివ్స్ ముగింపు సందర్భంగా ఒడిదుడుకులతో ట్రేడ్ అయినప్పటికీ.. 21 రోజుల చలన సగటుకు ఎగువన ముగిసింది. శుక్రవారం నిఫ్టీ ఇన్సైడ్ క్యాండిల్ను ఏర్పాటు చేయడం వల్ల గురువారం నాటి కనిష్ఠ, గరిష్ఠ స్థాయిలు 17,379-17,543 మార్కెట్కు కీలకం అయ్యాయి. దీంతో ఈ వారం నిఫ్టీ ఈ స్థాయిలకు పైన నిర్ణయాత్మకంగా కదలాడనుంది.
అయితే ప్రస్తుతానికి మార్కెట్ పాజిటివ్లోనే కనిపిస్తున్నా.. డైలీ చార్ట్లో వరుసగా రెండు బేరిష్ క్యాండిల్స్ ఏర్పడటం మార్కెట్ భవిష్యత్తు కదలికలకు శుభసూచకం కాదు. అందులోనే స్వింగ్ గరిష్ఠ స్థాయిల్లో బేరిష్ క్యాండిల్స్ బుల్లిష్ ధోరణికి ఏ మాత్రం సంకేతాలు కావు. ఈ వారానికి 17,693, 17,908 స్థాయిలు రెసిస్టెన్స్లుగా పని చేస్తాయి. అలాగే ఛానెల్ రెసిస్టెన్స్ కూడా దాదాపు 17,693 స్థాయిలోనే ఉంది. ఒకవేళ 17,379 స్థాయికి దిగువన ముగిస్తే మళ్లీ బేర్స్ తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. సోమవారం తొలి గంట తర్వాత ట్రెండ్ ధ్రువీకరణ అవుతుంది. మార్కెట్లో పరస్పర విరుద్ధ సంకేతాలున్నందున ప్రస్తుతానికి పోర్టుఫోలియో పాక్షిక లాభాల స్వీకరణే ఉత్తమం.
ఈ-పాన్ నంబర్ పొందండిలా..
ఇప్పటివరకు పాన్ కార్డు లేనివారికి కేవలం ఆధార్ కార్డు ఆధారంగా ఈ-పాన్ కార్డును ఐటీ శాఖ జారీ చేస్తున్నది. ఆదాయ పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్ https://eportal.in cometax.gov.in/ లో లాగినై ఇన్స్టాంట్ ఈ-పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అథంటికేషన్ కోడ్ వచ్చాక ఫొటో, చిరునామా, పుట్టినరోజు, జెండర్ తదితర వివరాలనివ్వాలి. వీటి ధ్రువీకరణ తర్వాత ఈ-పాన్ కార్డ్ వస్తుంది.