అది కర్ణాటకలో మండ్య జిల్లాలోని ఓ కళాశాల. టైం కావడంతో గ్రౌండ్లో బైక్ పార్క్ చేసిన ముస్కాన్ హడావుడిగా తరగతి గది వైపునకు నడుస్తున్నారు. ఇంతలో హిజాబ్ ధరించి వెళ్తున్న ఆమెను కాషాయ స్కార్ఫ్లు ధరించిన పాతికమందికిపైగా ముట్టడించారు. ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ముస్కాన్ కూడా ‘అల్లా హు అక్బర్’ అంటూ గట్టిగా అరుస్తూ.. చెయ్యి పైకి లేపుతూ కళాశాలలోకి నడువడం ప్రారంభించింది. దీంతో ఆమెను ఓ వ్యక్తి అనుసరించాడు. అతని వైపునకు తిరిగిన ముస్కాన్.. ‘నేను బుర్ఖా ధరిస్తే మీకు వచ్చిన సమస్య ఏమిటి?’ అని ప్రశ్నించింది. ఇంతలో ఆ గుంపు ముస్కాన్ను సమీపించడానికి ప్రయత్నించింది. సిబ్బంది వచ్చి ఆమెని కళాశాలలోకి తీసుకెళ్లారు.