ఆదిలాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ విస్తరణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని ఐటీ పెట్టుబడుల సీఈవో రంగినేని విజయన్ అన్నారు. స్థానిక ప్రైవేట్ హోటల్లో సీఐఐ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ బీడీఎన్టీ ఐటీ కంపెనీ సహకారంతో స్టార్టప్ ఎకోసిస్టం అండ్ ఇంటరాక్టివ్ సెషన్ ఆన్ ఇంటస్ట్రియల్ పొటెన్షియల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సర్కారు ఐటీ రంగం విస్తరణకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. ప్రపంచంలోని పెద్ద ఐటీ కంపెనీలు హైదరాబాద్లో పరిశ్రమలను ప్రారంభించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఆదిలాబాద్లో ఐటీ కంపెనీని ప్రారంభించడమే కాకుండా ఐటీ టవర్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు.
టవర్ నిర్మాణం కోసం మూడెకరాల స్థలాన్ని సేకరించినట్లు తెలిపారు. ఇక్కడి టవర్లో టీ హబ్, వీ హబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ పంటల ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేందుకు చాలా అవకాశాలున్నట్లు చెప్పారు. సీఐఐ ద్వారా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ.. పట్టణంలో ఏడాది కిందట ఏర్పాటు చేసిన బీడీఎన్టీ ఐటీ కంపెనీలో 120 మంది జిల్లా యువత ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపారు. ఐటీ కంపెనీకి ప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో త్వరలో ప్రారంభమయ్యే ఐటీ టవర్లో జిల్లాకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ఐటీ కంపెనీలను నెలకొల్పేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగినట్లు చెప్పారు.
పత్తి, సోయా, ఇతర వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉందని, జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకురావాలని కోరారు. ఆ తర్వాత బీడీఎన్టీ సీఈవో సంజయ్ దేశ్పాండే మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తాను స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీ కంపెనీని ప్రారంభించినట్లు తెలిపారు. ఏడాదికి బీడీఎన్టీ కంపెనీలో పనిచేస్తున్న యువత విదేశాలకు చెందిన ఐటీ కంపెనీలతో పనిచేస్తున్నట్లు చెప్పారు. సీఐఐ తరఫున జిల్లాలో ఐటీ, వ్యవసాయ, ఇతర పరిశ్రమలను నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు జోగు ప్రేమేందర్, సీఐఐ ప్రతినిధి రామకృష్ణ, పారిశ్రామికవేత్తలు రవీందర్ రావు, ప్రశాంత్, జిన్నింగ్ పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.