ముంబై, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 701.67 పాయింట్లు లేదా 1.23 శాతం ఎగిసి 57,521.06 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 971.46 పాయింట్లు పుంజుకున్నా డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటంతో మదుపరులు ఒకింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో 270 పాయింట్లు పడిపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 206.65 పాయింట్లు లేదా 1.21 శాతం ఎగబాకి 17,245.05 వద్ద నిలిచింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హిందుస్థాన్ యునిలివర్, ఇన్ఫోసిస్ తదితర షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు సైతం దేశీయ ఈక్విటీలకు కలిసొచ్చాయని ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంధన, బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే హెచ్యూఎల్ షేర్ విలువ అత్యధికంగా 4.55 శాతం పెరిగింది. భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మాత్రం నష్టపోయాయి.
ఆసియా దేశాల్లో ప్రధానమైన జపాన్, హాంకాంగ్, చైనా, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలోనూ కీలకమైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. బుధవారం అమెరికా సూచీలు సైతం లాభాల్లోనే స్థిరపడ్డాయి.
ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.19 లక్షల కోట్ల మార్కును దాటేసింది. గురువారం సంస్థ షేర్ విలువ 1.49% పుంజుకుని రూ.2,819.20 వద్దకు చేరింది. ఒకానొక దశలో రూ.2,850ని కూడా తాకడం గమనార్హం. ఈ క్రమంలోనే ట్రేడింగ్ ముగిసే సమయానికి సంస్థ మార్కెట్ విలువ రూ.19,07, 176.65 కోట్లు (దాదాపు 250 బిలియన్ డాలర్లు)గా నమోదైంది.