Israel attack : అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటన వెలువడిన వెంటనే లెబనాన్ (Lebanon) పై ఇజ్రాయెల్ (Israel) క్షిపణులతో విరుచుకుపడింది. లెబనాన్లోని హెజ్బొల్లా (Hezbollah) స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. మొత్తం 254 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ లెబనాన్పై దాడికి పాల్పడటంతో ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధి (strait of Hormuz) ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన వెంటనే లెబనాన్పై ఈ దాడులు జరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ మిత్రపక్షాలపై కూడా దాడులు చేయకూడదని ఇరాన్ డిమాండ్ చేయగా.. ఇజ్రాయెల్ అంగీకరించలేదు. హెజ్బొల్లా చేసే దాడులను అడ్డుకొనే లక్ష్యంతో లిటాని నది వరకు బఫర్జోన్ను ఏర్పాటు చేసుకోవడానికి మార్చి 2న ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పుడు ఆ ఆపరేషన్ను ఆపేందుకు ఇజ్రాయెల్ సుముఖంగా లేదు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం 10 నిమిషాల వ్యవధిలో లెబనాన్లోని పలు ప్రదేశాలపై ఇజ్రాయెల్ 100 ఎయిర్ స్ట్రయిక్స్ చేపట్టింది.