కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది పదో ఆంధ్ర మహాసభలో పన్నుల తీర్మానం. జయసూర్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభల్లో వ్యాపారులు, సంపన్నులపై పన్నులు విధించాలని సూచిస్తూ నిజాంను కోరాలని కమ్యూనిస్టులు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మాదిరాజు రామకోటేశ్వరరావు వ్యతిరేకించారు. నిజామాంధ్రలో పెద్ద ధనవంతులు లేరని, ఆదాయాలు కూడా అంతగా లేవని కారణాలు చూపారు. అధికారుల వేధింపులు పెరుగుతాయని హెచ్చరించారు.
వ్యాపారులపై పన్నులు వేస్తే, వాళ్లు వినియోగదారులపైనే వేస్తారని మిరియాల నారాయణ గుప్త అన్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చ వాడివేడిగా సాగింది. అనంతరం సభలో ఓటింగ్ నిర్వహించారు. 17 ఓట్ల తేడాతో ఈ తీర్మానం వీగిపోయింది. ఇక ఎవరిళ్లకు వాళ్లు పోతుంటే వ్యాపారులు, సంపన్నులపై పన్నును వ్యతిరేకించిన నేతల తీరుని నిరసిస్తూ.. ‘వ్యాపారులకు, షావుకారులకు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారు’ అంటూ నినాదాలు చేశారు.