నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఈ చిత్రంలోని రెండో లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. ‘ఏదో ఏదో తెలియని లోకమా..’ అనే పల్లవితో సాగే ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా, చైత్ర అంబడిపుడి ఆలపించారు. మిక్కీ జే మేయర్ స్వరకర్త. ఇందులో నాని, కృతిశెట్టి మధ్య రొమాన్స్ ఆకట్టుకునేలా సాగింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, డిసెంబర్ 24న విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో బెంగాలీ యువకుడు శ్యామ్ సింగరాయ్గా నాని కనిపించనున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినవ్గోమటం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, కథ: సత్యదేవ్ జంగా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.వెంకటరత్నం, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.