Iran vs US : ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో మరోసారి ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఒమన్ (Oman) తీరానికి సమీపంలో ఇరాన్ (Iran) కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) రెండు వాణిజ్య నౌకలపై క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో నౌకలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం అందగా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పర్యావరణానికి పెద్దగా ముప్పు వాటిల్లలేదని ప్రాథమికంగా వెల్లడైంది.
అమెరికా అధికారుల కథనాల ప్రకారం.. ఇరాన్ జరిపిన దాడుల్లో కనీసం రెండు నౌకలు దెబ్బతిన్నాయి. మరోవైపు ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ను గుర్తుతెలియని ప్రొజెక్టైల్ ఢీకొట్టింది. ఈ ప్రభావంతో ట్యాంకర్లో మంటలు చెలరేగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధృవీకరించింది. ఈ కీలక జలమార్గంలో నౌకలపై దాడులను నిలిపివేసేలా అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల ఒక అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, కొన్ని రోజుల వ్యవధిలోనే తాజా దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
ఇరాన్ చర్యలపై అమెరికా అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజవాయువు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.