న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ మెగా వేలం ప్రత్యేకంగా జరుగనున్నట్లు తెలుస్తున్నది. ముంబై కాకుండా ఈసారి బెంగళూరులో నిర్వహించాలని, అది కూడా ఒక రోజు కాకుండా రెండు రోజుల పాటు నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘కరోనా పరిస్థితులు అదుపు తప్పకపోతే భారత్లోనే వేలం ఉంటుంది. ఫిబ్రవరి 7-8 తేదీల్లో రెండు రోజుల పాటు వేలంపాట నిర్వహిస్తాం. బెంగళూరులో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. ప్రస్తుతం సమాలోచనలు జరుగుతున్నాయి’ అని బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి తెలిపాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కొత్తగా లక్నో, అహ్మదాబాద్లతో కలిపి పది ఫ్రాంచైజీలతో జరుగనున్న విషయం తెలిసిందే. పాత జట్లు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకునే ప్రక్రియ ముగియడంతో ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగనుంది.