హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు వివిధ స్థాయిలో కనబర్చిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. దీనికోసం గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆయా గ్రామీణ స్థానిక సంస్థలు కనబర్చిన ప్రతిభకు అవార్డులను అందిస్తారు. తెలంగాణలోని ఒక జిల్లా పరిషత్, నాలుగు మండల పరిషత్లు, ఆరు గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయతీ స్వశక్తి కరణ్ ఉత్తమ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ అవార్డుకు ఎంపికైన జిల్లా పరిషత్కు రూ.50 లక్షలు, ఒక్కో మండల పరిషత్కు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇస్తారు. అభివృద్ధి లో గ్రామ సభను సమర్థవంతంగా వినియోగించిన పంచాయతీలను నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారం అవార్డుకు ఎంపిక చేస్తారు. రాష్ట్రంలోని ఒక గ్రామ పంచాయతీని ఈ అవార్డుకు ఎంపిక చేసి పురస్కారంతోపాటు రూ.10 లక్షల నగదు అందిస్తారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ)లో రాష్ట్రంలో ఒక పంచాయతీకి అవార్డు, రూ.5 లక్షల నగదు అందిస్తారు. గ్రామ పంచాయతీలు పిల్లల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించే తీరు ఆధారంగా అవార్డు, రూ.5లక్షల నగదు ఇస్తా రు. పైఅవార్డులకు అర్హత ఉన్న గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు డిసెంబర్ 15లోగా వివరాలను అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన సమాచారాన్ని మండల, జిల్లా స్థాయి కమిటీలు ధ్రువీకరించి డిసెంబర్ 25లోగా రాష్ట్ర స్థాయి కమిటీకి ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది. ఈ అవార్డులను జాతీయ పంచాయతీ దినోత్సవమైన వచ్చే ఏప్రిల్ 24న అందిస్తారు.