ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కేంద్ర దర్యాప్తుసంస్థలు సహకరించాయని శివసేన ఆరోపించింది. ఇందుకు ఉదాహరణే మాయావతి అని పేర్కొంది. ‘ఉత్తరప్రదేశ్ను గతంలో మాయావతి పాలించారు. పులిలా నిలబడ్డారు. అలాంటి ఆమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంటీముట్టనట్టు వ్యవహరించారు. దీనికి కారణం.. ఆమెపై ఉన్న ఒత్తిడి.. ఆ ఒత్తిడి తెచ్చింది ఎవరంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు.. పాత కేసులను చూపిస్తూ.. భయపెట్టి.. ఒత్తిడి తెచ్చి.. ఎన్నికల్లో పోటీలో లేకుండా చేశాయి. దీంతో బీఎస్పీకి పడాల్సిన ఓట్లు బీజేపీకి పడ్డాయి. బీజేపీ విజయం సాధించింది. దీన్నిబట్టి బీజేపీ విజయానికి కేంద్రదర్యాప్తు సంస్థలు ఏ స్థాయిలో సహకరించాయో అర్థమవుతున్నది’అని శివసేన తన పత్రిక సామ్నాలో పేర్కొంది.