ఖైరతాబాద్, డిసెంబర్ 4 : విశ్వనగరాభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచిన జీహెచ్ఎంసీకి ఆస్తి పన్నుల బకాయిదారుల చర్యలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్లను సకాలంలో చెల్లించకుండా తప్పించుకోవడమే కాకుండా అధికారుల నుంచి ఒత్తిడి పెరిగినప్పుడు చెల్లని చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కోట్లాది రూపాయలు బకాయిలు పడుతూ అధికారుల నుంచి రెడ్ నోటీసులు రాగానే చెల్లని చెక్కులు ఇస్తూ మోసగిస్తున్నారు. చెక్ బౌన్స్ చేసిన వారిపై సెక్షన్ 138, 142 నేగోషియేబుల్ ఇన్స్ట్రూమెంట్ యాక్ట్ 357 ఆఫ్ సీఆర్పీసీతో పాటు సెక్షన్ 420 ప్రకారం క్రిమినల్ కేసులు పెడుతారు.
హోటల్ కత్రియా రూ.2కోట్ల చెక్ బౌన్స్
సోమాజీగూడ రాజ్భవన్ రోడ్లో కొనసాగుతున్న హోటల్ కత్రియా (శ్రీ లక్ష్మీగాయత్రి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్) జీహెచ్ఎంసీకి ప్రతి ఏడాది ఆస్తి పన్నులు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.6 కోట్లు బకాయిపడినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెడ్ నోటీసు జారీ చేయగా, ఇటీవల రూ.2 కోట్ల విలువైన చెక్కును అందించి, మిగతావి విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయ్యిందని పేర్కొన్నారు. సర్కిల్ 17 పరిధిలోని హర్షా టోయోట షోరూమ్ రూ.22లక్షలు, వోక్స్వ్యాగన్స్ రూ.8లక్షలు, నాసర్ స్కూల్ రూ.9లక్షలతో పాటు ఓ సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ కూడా రూ.70లక్షల విలువైన చెల్లని చెక్ ఇచ్చినట్లు వివరించారు.
క్రిమినల్ కేసులు తప్పవు
సర్కిల్ 17 పరిధిలో 119 మంది చెక్కులు బౌన్స్ అయ్యాయి. చెల్లని చెక్కులు ఇవ్వడం చట్టరీత్యా నేరం. వారికి ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించాం. క్రిమినల్ కేసులు పెట్టి వారిపై చర్యలు తీసుకుంటాం. పాతబకాయిదారులు వెంటనే ఆస్తి పన్నులు చెల్లించాలి.