ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 21 : ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ విద్యార్థులకు ఈ నెల 23న ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో వీటిని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి రవిబాబు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని కళాశాలలు అన్ని స్పెల్స్లో వచ్చేలా షెడ్యూల్ను రూపొందించారు. ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్స్ రాయనున్నారు.
పరీక్షకు అరగంట ముందు ప్రశ్నాపత్రాలు ఆన్లైన్లో ఉంచేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. గతంలో ప్రశ్నపత్రాలు కళాశాలలకు వారం రోజుల ముందుగానే చేరుకోవడంతో అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం వన్టైమ్ (ఓటీపీ) పాస్వర్డ్ విధానంలో పరీక్ష కేంద్ర ఎగ్జామినర్ సెల్ఫోన్కి అరగంట ముందు మాత్రమే ఆన్లైన్లో పంపుతారు. ఎగ్జామినర్ సెల్ఫోన్కు మెసేజ్ రాగానే అతడు సంబంధిత వెబ్సైట్ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రశ్నలు ముందుగా తెలిసే అవకాశం ఉండదు. అలాగే హాల్టికెట్ ఆధారంగా ఏ విద్యార్థికి ఏ సెట్ ప్రశ్నాపత్రం ఇవ్వాలనే అంశాన్ని పేపర్ కోడ్ల ఆధారంగా వెబ్సైట్లో పేర్కొంటారు. కళాశాలల వారీగా ప్రశ్నాపత్రాల కోడ్లు వేర్వేరుగా ఉండడంతోపాటు పరీక్ష సమయానికి అరగంట ముందుగా ఇన్విజిలేటర్ హాల్టికెట్ ఆధారంగా ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసేలా మార్పులు చేశారు.
మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 8 వరకు జరుగనున్నాయి. ఈ ప్రయోగ పరీక్షల్లో పరీక్షల అనంతరం వెంటనే వాల్యుయేషన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా జరుగనున్నాయి. పరీక్ష ముగిసిన అనంతరం గంటలోపే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. వాల్యుయేషన్ చేసిన మార్కుల జాబితాను ఎగ్జామినర్ ఇంటర్ బోర్డుకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో అన్ని పరీక్షలు ముగిసే వరకు జవాబు పత్రాలను కళాశాలలోనే భద్రపరిచి ఒకేసారి పంపేవారు. దీంతో అవకతవకలు జరిగేందుకు అవకాశం ఉండేది.
ప్రాక్టికల్స్ కోసం ఖమ్మం జిల్లాలో 102 కేంద్రాలను ఎంపిక చేశారు. ఖమ్మంలో జనరల్కు 73 కేంద్రాలను, ఒకేషనల్కు 29 కేంద్రాలను ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లాలో ఎంపీసీలో 11,261 మంది, బైపీసీలో 3,823 మంది జనరల్ కోర్సుల విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరు కానున్నారు. 4,825 మంది వృత్తి విద్యాకోర్సుల విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను మూడు దశల్లో నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ఇందులో భాగంగా స్పెల్ను 5 రోజులపాలు నిర్ణయించే విధంగా ఏర్పాట్లు చేశారు. బుధవారం మొదలయ్యే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 8తో ముగియనున్నాయి. పరీక్షల నిర్వహణను డీఐఈవో రవిబాబు, డీఈసీ సభ్యులు పర్యవేక్షించనున్నారు. మొదటి స్పెల్ ఈ నెల 23 నుంచి 27 వరకు, రెండో స్పెల్ ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు, మూడో స్పెల్ ఏప్రిల్ 3 నుంచి 8 వరకు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు రెండు ఫ్లయింగ్ స్కాడ్ బృందాల సభ్యులు (వీటిలో ఫిజిక్స్ లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్), ఒక డెక్ కమిటీ (ఇద్దరు ప్రిన్సిపాల్స్, ఒక లెక్చరర్) సభ్యులు పర్యవేక్షించనున్నారు.