పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు
జేఈఈ మెయిన్ తేదీల సవరణతో టైమ్టేబుల్ ముందుకు
వేర్వేరుగా పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎస్సెస్సీ, ఇంటర్ అధికారులు
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్స్ మారాయి. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలను సవరించడంతో ఈ పరీక్షలను అధికారులు కాస్త ముందుకు జరిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, ఎస్సెస్సీ పరీక్షలు మే 23వ తేదీ నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు వేర్వేరుగా పరీక్షల షెడ్యూల్స్ను బుధవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు, సెకండియర్ పరీక్షలు మే ఏడో తేదీ నుంచి నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తారు.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే జరుగుతుండగా.. అధికారులు వీటిలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంటర్లో ఇంటర్నల్స్ అయిన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షలు గతంలో ప్రకటించినట్టుగా ఏప్రిల్ 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఎస్సెస్సీ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.