జొహన్నెస్బర్గ్: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా సఫారీ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే మూడు మ్యాచ్ల సిరీస్కు దూరమయ్యాడు. అయితే గాయం విషయంలో స్పష్టత ఇవ్వని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ).. అతడి స్థానంలో మరో ఆటగాడిని కూడా తీసుకోలేదు. ‘పేస్ బౌలర్ నోర్జే గాయం కారణంగా భారత్తో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. పాత గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోకపోవడంతో నోర్జేపై అదనపు భారం వేయడం లేదు. అతడి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు’అని సీఎస్ఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు (బాక్సింగ్ డే) ప్రారంభం కానుండగా.. సఫారీ పేస్ దళానికి కగిసో రబడ సారథ్యం వహించనున్నాడు.