సిటీబ్యూరో, జనవరి 23(నమస్తే తెలంగాణ): ‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా ప్రజలకు శ్రేయస్కరమైన తాగునీటిని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ మహా నగరానికి సైతం తాగునీరు అందిస్తున్నది. ఔటర్ రింగు రోడ్డు లోపలున్న గ్రామాలకే కాక, ఇక మీదట కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు సమృద్ధిగా తాగునీరందనుంది. పట్టణ భగీరథలో భాగంగా ఇప్పటికే రూ.756.56 కోట్లను వెచ్చించి మొత్తం 70 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 164 రిజర్వాయర్లను నిర్మించింది.
ఈ ప్రాజెక్టుతో 191 గ్రామాలలోని దాదాపు 10 లక్షల కుటుంబాలకు మెరుగ్గా తాగునీటిని అందిస్తున్నది. ఇందులో భాగంగానే విస్తరిత ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్లు, హైరైజ్డ్ (అకాశ హర్మ్యాలు) భారీగా వెలుస్తున్న నేపథ్యంలో వీటిలో ఉండే ప్రజలకు నీటి అవసరాలను తీర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రూ.1200 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పథకానికి నిధులను కేటాయించింది. ఈ మేరకు 12 మండలాల పరిధిలో 137 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్లు, 2,108 కిలోమీటర్ల పైపులైన్ విస్తరణ పనులు జలమండలి చేపట్టేందుకు సిద్ధమైంది.
ఓఆర్ఆర్ ఫేజ్-2 తాగునీటి పథకం పనులను త్వరితగతిన చేపట్టి ఈ ఏడాది చివరి కల్లా పనులను పూర్తి చేసి ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలని ఇటీవల సమీక్షల్లో మంత్రి కేటీఆర్ జల మండలి ఎండీ దాన కిశోర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలోనే ఫేజ్-2 పథకం పనులను సోమవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు జల మండలి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మణికొండ పురపాలక సంఘం పరిధిలోని అల్కాపురి టౌన్షిప్ (రోడ్ నంబరు-4 )లో ఫేజ్-2 తాగునీటి పథకం పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ప్రాజెక్టు కీలక అంశాలు..
సరూర్నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్పేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్చెరువు, ఆర్సీ పురం/ బొల్లారం మండలాల పరిధిలో రిజర్వాయర్ల(జీఎల్ఎస్ఆర్/ఈఎల్ఎస్ఆర్లు)తో పాటు పైపులైన్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఇన్లెట్, ఔట్లెట్ పనులు జరుగనున్నాయి.
సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఆండ్ ఎన్విరాల్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ (సీపీహెచ్ఈఈఓ) నిబంధనల మేరకు లీటర్స్ ఫర్ క్యాపిటా ఫర్ డే(ఎల్పీసీడీ) ప్రకారం, భవిష్యత్లో అవసరమయ్యే నీటిని అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నారు.
137 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం
కొత్తగా 2,108 కిలోమీటర్ల పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వాయర్లకు ఫీడర్ మెయిన్లు, ట్రంక్ ఔట్లెట్ మెయిన్లు, సరఫరా వ్యవస్థ ఏర్పాటు.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం.
క్లోరినేషన్ గదులు, పంపింగ్ స్టేషన్లు, క్లోరినేషన్ సామగ్రి, ట్రాన్స్ ఫార్మార్లు, ఇతర ఎలెక్ట్రో మెకానికల్ పరికరాల ఏర్పాటు.
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా రెండు లక్షల వరకు మంచినీటి నల్లా కనెక్షన్లు రానున్నాయి. సుమారు 20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది. ఇప్పటికే ఉన్న 1.5 లక్షల నల్లా కనెక్షన్లకు సరిపడా నీరు అందుతుంది.