అడవిదేవులపల్లి మండలంలో పెరిగిన సాగు l బోరుబావుల కింద ఆరుతడి పంటగా సేద్యం
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు రైతులు ఇతర పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పప్పు దినుసులు లాభసాటిగా ఉండడంతో వాటిని ఎంచుకుంటున్నారు.అడవిదేవులపల్లి మండలంలోని మెట్ట రైతులు బోరు బావుల కింద అల్చింత(బొబ్బర) పంట సాగు చేస్తున్నారు. అల్చింత సాగు ఇక్కడ కొత్తేమీ కాకున్నా గతంతో పోలిస్తే నేడు పెద్ద ఎత్తున సాగు చేస్తుండడం గమనార్హం.
మండలంలోని అన్ని గ్రామాల్లో యాసంగిలో చిరుధాన్యాల సాగు అధికంగా ఉంటుంది. అందులోనూ అల్చింతలు అతి తక్కువ కాలం, కొద్దిపాటి ఖర్చుతో పాటు అధిక దిగుబడిని ఇస్తున్నాయని రైతులు చెప్తున్నారు. బోర్లు, బావుల కింద వేరుశనగ, పెసర, ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. అల్చింత పంటను గతేడాది అడవిదేవులపల్లి, కొత్తనందికొండ, చాంప్లాతండా, నడిగడ్డ, నల్లమిట్టతండా గ్రామాల రైతులు ఎక్కువగా సాగుచేసి లాభాలు గడించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పెద్దమొత్తంలో సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. గత సంవత్సరం మండల వ్యాప్తంగా సుమారు 5 వేల ఎకరాల్లో బొబ్బర్లు సాగు చేయగా ఈ ఏడాది అంతకు రెట్టింపు విస్తీర్ణంలో సాగు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఎకరానికి సుమారు రూ.5వేల నుంచి 8వేల వరకు పెట్టుబడి అవుతుండగా సుమారు రూ.30వేల నుంచి 35వేల ఆదాయం వస్తుందని తెలిపారు. మూడు నుంచి నాలుగు నెలల్లో పంట చేతికి వస్తుందని రైతులు చెప్తున్నారు.
అల్చింత పంట బాగుంది..
ఆరుతడి పంటల్లో అల్చింత చాలా బాగున్నది. తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది. అంతేకాక మూడు, నాలుగు తడులతో పంట చేతికొస్తుంది. మండలానికి కాల్వలు, లిఫ్ట్లు లేకపోవడంతో రైతులు ఎక్కువగా బోర్లు, బావుల కింద ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు.
నీటి ఎద్దడిని తట్టుకుంటుంది..
అల్చింత పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. విత్తనాలు సాళ్లల్లో వేస్తే ఎకరానికి 8 కిలోలు, చల్లుకుంటే 10 కిలోలు సరిపోతాయి. 90 రోజుల్లో పంట చేతికొస్తుంది. అతి తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం రైతుకు లభిస్తుంది. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది. కరువు పరిస్థితిని తట్టుకోవడంతో పాటు నత్రజనిని స్థిరీకరిస్తుంది.