హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఐపాస్తో రాష్ట్ర పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తున్నది. అనుమతుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పిపోవడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సొంతంగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొస్తున్నారు. దీంతో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటులో ఏటేటా ఆకర్షణీయ స్థాయిలో వృద్ధి కనిపిస్తున్నది. ఫలితంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా లభిస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 చివర్లో ప్రభుత్వం టీఎస్ ఐపాస్ చట్టాన్ని తెచ్చింది. దీనిప్రకారం అన్నిరకాల అనుమతులు సింగిల్ విండో పద్ధతిలో నిర్ణీత కాలవ్యవధిలో మంజూరు చేస్తున్నారు.
టీఎస్ఐఐసీ అధికారుల వివరాల ప్రకారం ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్లుసహా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సిమెంట్, కాంక్రీట్ ఉత్పత్తులు, గ్రానైట్, స్టోన్ క్రషర్లు తదితర రంగాల్లో శరవేగంగా తెలంగాణ పురోగతి సాధిస్తున్నది. అత్యధికంగా ఫుడ్ ప్రాసెసింగ్లో గత ఆర్థిక సంవత్సరం 570 పరిశ్రమలు వచ్చాయి. 495 యూనిట్లతో ఇంజినీరింగ్ రంగం ద్వితీయ స్థానంలో ఉన్నది. అలాగే రైస్ మిల్లులు, నూనె మిల్లులు, ఇతర ఆహార పరిశ్రమలు కూడా అధికంగా ఏర్పాటవుతున్నాయి. ఉద్యోగ కల్పనలో వివిధ పరిశ్రమలతోపాటు ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు ముందున్నాయి. 2020-21లో 1,24,829 మందికి ఉపాధి లభించింది. అలాగే ఔషధ, కెమికల్ రంగాల్లో 2015-16 నుంచి ఏటా పదివేల పైచిలుకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.
కరోనా ప్రభావం ఉన్నా 2020-21లో 9,371 మందికి జీవనోపాధి దొరికింది. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్ రంగాల్లో సైతం 14వేలకుపైగా ఉద్యోగాలు రావడం విశేషం. ఇక పెట్టుబడుల విషయానికొస్తే.. పరిశ్రమలతోపాటు రియల్ ఎస్టేట్, ఐటీలో గత ఆర్థిక సంవత్సరం రూ.19,922 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏటా ఈ రంగాల్లో సగటున రూ.5 వేల కోట్ల పెట్టుబడులు వస్తుండగా, 2018-19లో రూ.22,472 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. సోలార్ ఎనర్జీ, ఫార్మా, కెమికల్ రంగాల్లో సైతం గణనీయంగా పెట్టుబడులు వచ్చాయి.
ఇబ్బందులు పోయాయి: సుధీర్ రెడ్డి
టీఎస్ ఐపాస్ చట్టం రావడంతో కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి ఎంతో ఊరట లభించినైట్లెంది. గతంలో పెట్టుబడులు సమకూర్చుకోవడం ఎంత కష్టమో అనుమతులు పొందడం అంతకన్నా కష్టంగా ఉండేది. ఇప్పుడు అనుమతులు, ఇతర ప్రోత్సాహకాలన్నీ సత్వరమే విడుదలవుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటులో ఏటా పెరుగుదల చోటుచేసుకోవడం వెనుక ఇదే ప్రధాన కారణం. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, అనుమతులు వెనువెంటనే మంజూరయ్యేలా చేస్తున్నారు.