న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్కు జర్మన్ ఓపెన్లో చుక్కెదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్-300 టోర్నీ ప్రిక్వార్టర్స్లోనే ఈ ఇద్దరు షట్లర్లు ఇంటి బాటపట్టగా.. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ పీవీ సింధు 14-21, 21-15, 14-21తో జాంగ్ యీ మన్ (చైనా) చేతిలో ఓటమి పాలవగా.. సైనా నెహ్వాల్ 10-21, 15-21తో ఎనిమిదో సీడ్ రచనోక్ ఇంతనోన్(థాయ్లాండ్)చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ 21-16, 21-23, 21-18తో లూ గువాంగ్ జూ (చైనా)పై.. ప్రణయ్ 21-19, 24-22తో లీ చైక్ యీ పై విజయాలు సాధించారు.
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో గురువారం ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్.. లూ గువాంగ్ జూ (చైనా)పై కీలక విజయం సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో కరోనా వైరస్ బారిన పడి ఇండియా ఓపెన్కు దూరమైన శ్రీకాంత్.. టోర్నీ ఆరంభం నుంచి మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. మూడు గేమ్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కీలక సమయాల్లో శ్రీకాంత్ పైచేయి కనబర్చాడు. లాంగ్ ర్యాలీలతో పాటు చురుకైన నెట్గేమ్తో ఆకట్టుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, టాప్ సీడ్ విక్టర్ అక్సల్సెన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో మ్యాచ్లో ప్రణయ్ పూర్తి ఆధిపత్యం కనబర్చాడు. ఇక పురుషుల డబుల్స్లో కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 23-21, 16-21, 21-14తో భారత్కే చెందిన ఇషాన్ భట్నాగర్, సాయి ప్రతీక్ ద్వయంపై నెగ్గింది.