హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రం లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 5న నిర్వహించ తలపెట్టిన చేరిక సమావేశ ఏర్పాట్లు ము మ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాందే డ్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్సింగ్ గ్రౌండ్లో వేదిక సిద్ధమైంది. ఆ ప్రాంగణమంతా గులాబీ తోరణాలు, హోర్డింగులతో ముస్తాబైంది. నగరంలోని ప్రధాన రహదారుల వెంట ఫ్లెక్సీలు, హోర్డింగులను ఏర్పాటు చేస్తుండగా, వాటిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. బీఆర్ఎస్ సమావేశంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నాందేడ్లో ఉన్న దాదాపు 40 వేల మందికిపైగా తెలుగువారు కేసీఆర్ రాక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ గూటికి..
నాందేడ్తోపాటు తెలంగాణ సరిహద్దు గ్రా మాల్లో తెలంగాణ పథకాలపై జోరుగా చర్చ కొనసాగుతున్నది. ముఖ్యంగా ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతుబీమా పథకాలను వేనోళ్ల కీర్తిస్తున్నారు. ఆ పథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ పథకాలు, అభివృద్ధి విధానాలకు ఆకర్షితులైన పలు సరిహద్దు సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సమావేశం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న, ఇతర తెలంగాణ నేతలకు ఒక్కొక్కరుగా టచ్లోకి వస్తున్నారు. తమ తమ గ్రామాల్లో స్వచ్ఛందంగా సమావేశాలను ఏర్పాటు చేస్తూ.. గులాబీ నేతలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ పథకాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ సమక్షంలో జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, 40 గ్రామాలకు చెందిన సిట్టింగ్ సర్పంచ్లు మూకుమ్మడిగా చేరే అవకాశమున్నదని తెలుస్తున్నది.
కలియతిరుగుతూ.. ప్రజలను కలుస్తూ..
బీఆర్ఎస్ చేరికల సమావేశ నిర్వహణ ఏర్పాట్లను తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, చెన్నూరు, ముథోల్, మల్కాజ్గిరి, బోధన్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, విఠల్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, షకీల్, రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. వేదిక నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే.. మరోవైపు సరిహద్దు గ్రామాల్లో కలియ తిరుగుతున్నారు. నాందేడ్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ధర్మాబాద్, కిన్వట్, భోకర్, బిలోలి తదితర నియోజకవర్గాలను చుట్టివస్తూ, అక్కడివారిలో తెలంగాణ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. నాందేడ్ పట్టణంలోని తెలుగువారితో ప్రత్యేక భేటీలను నిర్వహిస్తూ బీఆర్ఎస్ ఏర్పా టు ఆవశ్యకతను వివరిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి నాందేడ్లోని గ్రామీణుల నుంచి పట్టణవాసుల వరకు విశేష స్పందన లభిస్తున్నది.
బీఆర్ఎస్కు గురుగోవింద్సింగ్ ఆశీస్సులు
నాందేడ్ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్కు ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో బీఆర్ఎస్ సమావేశ నిర్వహణ కోసం గురుద్వారా అనుమతి లభించడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. దాదాపు గత 40 ఏండ్లుగా ఆ స్థలంలో ఎలాంటి రాజకీయ సమావేశాలకు గురుద్వారా అనుమతి ఇవ్వలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించిన అశోక్ చవాన్ అడిగినా, గురుద్వారా నిరాకరించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చేపట్టిన జోడోయాత్ర సభ కోసం ఆ పార్టీ చేసిన అభ్యర్థనలను కూడా తిరస్కరించింది. కానీ బీఆర్ఎస్ సమావేశానికి ఎలాంటి షరతులు లేకుండా..అడిగిన వెంటనే గురుద్వారా అనుమతులు ఇవ్వడంపై స్థానిక సీనియర్ అధికారులతోపాటు పట్టణవాసులు ఆశ్చ ర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశం కోసం, పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన కేసీఆర్ సంకల్పానికి గురుగోవింద్సింగ్ ఆశీస్సులు లభించాయని అభివర్ణిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో సభ ఏర్పాట్లను చేపట్టలేదని
చెప్తున్నారు.
రైతుల నుంచి విశేష స్పందన: మంత్రి అల్లోల
బీఆర్ఎస్ పార్టీకి రైతులు, వృద్ధుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సమావేశ ఏర్పా ట్లు నేటితో పూర్తవుతాయని వెల్లడించారు. నాందేడ్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై ఊహించనిరీతిలో విశేష స్పందన లభిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణ తరహా పాలన తమకూ కావాలని కోరుతున్నారని తెలిపారు. ఇందుకోసం బీఆర్ఎస్ వెంట నడుస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఇప్పటికే పలువురు నేతలు పార్టీలో చేరారని వివరించారు. 5న ఊహించనిరీతిలో భారీగా చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు.
తెలంగాణ తరహా అభివృద్ధి : ఎమ్మెల్యే బాల్క
సమావేశ ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకొన్నాయని విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. నాందేడ్ పట్టణవాసులతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు తెలంగాణ అభివృద్ధితో తమ అభివృద్ధిని పోల్చి చూసుకుంటున్నారని, అనతికాలంలోనే కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణలో వచ్చిన మార్పులను చూస్తూ ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. తెలంగాణ తరహాలోనే తమకూ ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్కు నాందేడ్లో అనూహ్య స్పందన లభిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. సమావేశానికి స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు, కేసీఆర్ మాటలు వినేందుకు ప్రజలు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారని తెలిపారు.