జకర్తా: ఇండోనేషియాలో కరోనా మహమ్మారి రికార్డు స్థాయికి చేరుకుంది. అక్కడ రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో రికార్డు నమోదైంది. గడిచిన 24 గంటల్లో అక్కడ మొత్తం 27,913 మందికి కొత్తగా పాజిటివ్ వచ్చింది. కరోనా వైరస్ ఉద్భవించినప్పటి నుంచి ఇండోనేషియాలో ఒక్కరోజే ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపి ఇండోనేషియాలో మొత్తం కేసుల సంఖ్య 22,56,851కి చేరింది.
ఇక కరోనా మరణాలు కూడా ఇండోనేషియాలో భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 493 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇండోనేషియాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 60,027కు పెరిగింది. కొత్తగా 13,282 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 19,15,147కు పెరిగింది. ఇండోనేషియాలోని మొత్తం 34 ప్రావిన్స్లకు మహమ్మారి వ్యాపించింది.