ముంబై, ఆగస్టు 28: దేశీయ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 21తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 12.422 బిలియన్ డాలర్లు ఎగబాకి 729.328 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లిడించింది. మారకం విల్వలు ఇంతటి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం దేశీయ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 9.905 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27తో ముగిసిన వారాంతానికి నమోదైన 728.494 బిలియన్ డాలర్లు ఇదే గరిష్ఠ స్థాయి. మళ్లీ ఇప్పుడు ఆరు నెలల తర్వాత గరిష్ఠ స్థాయికి చేరాయని పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రూపాయి విలువ గరిష్ఠ స్థాయిలో పతనం కావడంతో రిజర్వుబ్యాంక్ జోక్యం చేసుకోని డాలర్ల విక్రయించడంతో అడ్డుకట్ట పడింది.
గత వారాంతానికిగాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 9.482 బిలియన్ డాలర్లు ఎగబాకి 591.333 బిలియన్ డాలర్లకు చేరుకోవడం వల్లనే రిజర్వులు రికార్డు స్థాయికి ఎగబాకాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. విదేశీ మారకపు నిల్వల్లో యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికేతర కరెన్సీల విలువ పెరుగడం లేదా తగ్గడం వల్ల కలిగే ప్రభావాలు కూడా విదేశీ నిల్వలపై ప్రభావం చూపనున్నాయి. అలాగే బంగారం రిజర్వులు 2.801 బిలియన్ డాలర్లు ఎగబాకి 114.218 బిలియన్ డాలర్లకు చేరుకోగా..స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 112 మిలియన్ డాలర్లు అధికమై 18.852 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్ వద్ద భారత రిజర్వులు 26 మిలియన్ డాలర్లు అధికమై 4.925 బిలియన్ డాలర్లకు చేరాయి.