న్యూఢిల్లీ : దేశంలో టీకాల డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు 19,84,43,550 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. 18-44 సంవత్సరాల వయస్సున్న 12,52,320 మంది లబ్ధిదారులకు సోమవారం మొదటి డోసు అందజేసినట్లు చెప్పింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1,18,81,337 మందికి మొదటి మోతాదులు అందజేసినట్లు చెప్పింది. బిహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 18-44 సంవత్సరాల వయస్సున్న వారికి 10లక్షలకుపైగా డోసులు వేశాయని వివరించింది. టీకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నాటికి 129వ రోజు చేరగా.. ఒకే రోజు 23,65,395 వ్యాక్సిన్ మోతాదులు ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందులో 21,90,849 మందికి మొదటి మోతాదు, 1,74,546 మంది రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది.