న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్.. కొరియా ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో శుక్రవారం మూడో సీడ్ సింధు 21-10, 21-16తో బుసానన్ ఓంగ్బమ్రున్ఫాన్ (థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది. ఇటీవల స్విస్ ఓపెన్ ఫైనల్లో బుసానన్ను చిత్తు చేసి టైటిల్ పట్టిన సింధు.. ఇక్కడ కూడా అదే జోరు కనబర్చింది. 44 నిమిషాల్లో ముగిసిన పోరులో స్మాష్లు, డ్రాప్లతో పాటు క్రాస్ కోర్ట్ షాట్లతో సింధు చెలరేగిపోయింది. వరుస గేమ్ల్లో విజృంభించిన తెలుగమ్మాయి.. బుసానన్పై 17వ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21-12, 18-21, 21-12తో సన్ వాన్హో (కొరియా)పై ఉత్కంఠ విజయం సాధించాడు. తొలి గేమ్ నెగ్గిన శ్రీకాంత్.. రెండో గేమ్లో పరాజయంతో వెనుకబడ్డా ఆ తర్వాత తిరిగి పుంజుకొని సత్తాచాటాడు. గంటా రెండు నిమిషాల పాటు సాగిన పోరులో శ్రీకాంత్ తన నెట్ గేమ్తో ఆకట్టుకున్నాడు. గత మూడు పర్యాయాలు సన్ వాన్హో చేతిలో ఓటమి పాలైన శ్రీకాంత్.. ఈసారి ఆ కసినంతా కోర్టులో చూపెట్టాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 20-22, 21-18, 20-22తో కాంగ్ మిన్యుక్-సెయో సెంగ్జీ (కొరియా) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట ఆడిన తొలి మ్యాచ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరుగనున్న సెమీఫైనల్స్లో రెండో సీడ్ అన్ సెయాంగ్ (కొరియా)తో సింధు.. మూడో సీడ్ జొనాథన్ క్రిస్టి (ఇండోనేషియా)తో శ్రీకాంత్ తలపడనున్నారు.