ఇస్లామాబాద్ : దేశ విభజన సమయంలో తన కుటుంబం నుండి విడిపోయిన 75 సంవత్సరాల అనంతరం కర్తార్పూర్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్లో పాకిస్తాన్కు చెందిన తన ముస్లిం సోదరిని కలుసుకున్న జలంధర్కు చెందిన సిక్కు వ్యక్తి అమర్జిత్ సింగ్ ఆనందానికి అవధులు లేవు. విభజన సమయంలో అతని ముస్లిం తల్లిదండ్రులు పాకిస్తాన్కు వలసవెళ్లినప్పుడు సింగ్ అతడి సోదరిని భారత్లో విడిచివెళ్లారు. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో కర్తార్పూర్ గురుద్వార దర్బార్ సాహిబ్ వేదికగా వీల్ఛైర్లో కూర్చున్న అమర్జిత్ సింగ్ బుధవారం తన సోదరిని కలుసుకున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడున్న వారందరి కండ్లు చెమ్మగిల్లాయి.
సుదీర్ఘకాలం అనంతరం తన సోదరిని కలుసుకునేందుకు వీసాతో అట్టారి-వాఘా బోర్డర్ ద్వారా సింగ్ పాకిస్తాన్కు చేరుకున్నారు. సోదరుడు సింగ్ను చూసిన అనంతరం కుల్సుం (65) కూడా ఉద్వేగానికి లోనయ్యారు. వారు ఇరువురూ ఆప్యాయంగా కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. సోదరుడిని కలిసేందుకు ఆమె తమ సొంత పట్టణం ఫైసలాబాద్ నుంచి కుమారుడు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. 1947లో జలంధర్ నుంచి తమ తల్లితండ్రులు పాకిస్తాన్కు వలస వచ్చారని, ఆ సమయంలో తన సోదరుడు, సోదరిని అక్కడే వదిలివచ్చారని కుల్సుం చెప్పుకొచ్చారు. తాను పాకిస్తాన్లో పుట్టానని, తన సోదరుడు, సోదరిని భారత్లో విడిచివచ్చానని తన తల్లి తరచూ చెబుతుండేదని గుర్తుచేసుకున్నారు.
పిల్లలను విడిచి తల్లడిల్లిన తల్లి..
తన పిల్లలు గుర్తుకువచ్చినప్పుడు తల్లి ఏడుస్తూ ఉండేదని చెప్పారు. తన సోదరుడు, సోదరిని కలుస్తానని తాను ఎన్నడూ ఊహించలేదని భావోద్వేగానికి లోనయ్యారు. అయితే కొన్నేండ్ల కిందట తన తండ్రి స్నేహితుడు సర్ధార్ దారా సింగ్ భారత్ నుంచి పాకిస్తాన్ రాగా తన కుమారుడు, కుమార్తెను భారత్లో విడిచి వచ్చిన సంగతిని ఆయనకు తన తల్లి చెప్పారని కుల్సుం అన్నారు. తమ గ్రామం, గ్రామంలో తమ ఇల్లున్న ప్రాంతం గురించి దారా సింగ్కు తమ తల్లి చెప్పారని కుల్సుం తెలిపారు. దీంతో దారాసింగ్ పడవాన్ గ్రామంలోని తమ తల్లి ఇంటిని సందర్శించారని చెప్పారు. కుమారుడు బతికే ఉన్నాడని, కూతురు చనిపోయిందని తమ తల్లికి దారాసింగ్ సమాచారం అందించాడని, కుమారుడు అమర్జిత్ సింగ్ను 1947లో సిక్కు కుటుంబం దత్తత తీసుకుందని చెప్పాడని కుల్సుం తెలిపారు.
వాట్సాప్లో కలుసుకుని ఆపై..
సోదరుడి సమాచారం తెలిసిన తర్వాత కుల్సుం వాట్సాప్లో సింగ్తో కనెక్ట్ అయి ఆపై కలుసుకోవాలని నిర్ణయించారు. వెన్నునొప్పితో బాధపడుతున్నా తన సోదరుడిని కలవాలనే కోరికతో కర్తార్పూర్ వరకూ ప్రయాణించారు. తన తల్లితండ్రులు పాకిస్తాన్లో ఉన్నారని, వారు ముస్లింలని తొలిసారిగా తెలుసుకున్న తర్వాత షాక్ తిన్నానని సింగ్ గుర్తుచేసుకున్నారు. తన సొంత సోదరులను, సోదరిని కలుసుకోవాలనుకున్నానని చెప్పారు. తన సోదరుల్లో ముగ్గురు జీవించి ఉన్నారని తెలిసి సంతోషించానని అన్నారు. వారిని తన సిక్కు కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు భారత్కు తీసుకువెళతానని చెప్పారు. మరోవైపు 75 ఏండ్ల తర్వాత అయినా తన తల్లి కోల్పోయిన సోదరుడిని పొందడం పట్ల సంతోషంగా ఉన్నానని కుల్సుం కుమారుడు షాజాద్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.