Indian public school | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 21 : విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ రోజా సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం గర్రెపల్లి పీ హెచ్ సీ డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ రోజా మాట్లాడుతూ మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును చెడగొట్టే విధంగా ప్రభావం చూపుతాయని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
మత్తుపదార్థాల వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఒక్కసారి అలవాటు పడితే చదువు, జీవిత లక్ష్యాలపై ప్రభావం చూపుతోందని విద్యార్థులకు వివరించారు. పాఠశాల విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో చురుకుగా పాల్గొని మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
సమాజం అభివృద్ధి కోసం విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగాలని, ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించనున్నట్టు పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, ఎంఎల్ఎచ్పీ దివ్య, ఏఎన్ఎం రమాదేవి, ఆశ కార్యకర్తలు ఎన్ సుజాత, ఎన్ కోమల విద్యార్థులు పాల్గొన్నారు.