బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. తొలి పోరులో జర్మనీపై ఏకపక్ష విజయం సాధించిన మన అబ్బాయిలు.. సోమవారం 5-0తో కెనడాను చిత్తు చేశారు. గ్రూప్-‘సి’లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంతో నాకౌట్కు అర్హత సాధించింది. మొదట సింగిల్స్లో ప్రపంచ చాంపియన్షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ 20-22, 21-11, 21-15తో బ్రియాన్ యాంగ్పై గెలుపొందాడు. 52 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన శ్రీకాంత్.. ఆ తర్వాత ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 21-12, 21-11తో ఆంటోనీ-కెవిన్ లీ ద్వయంపై విజయం సాధించడంతో భారత ఆధిక్యం 2-0కు పెరిగింది. మూడో పోరులో హెచ్ ఎస్ ప్రణయ్ 21-15, 21-12తో సంకీర్త్పై గెలువడంతోనే పోరు భారత్ వశం కాగా.. రెండో డబుల్స్లో కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్, ఆఖరి సింగిల్స్లో ప్రియాంషు రజావత్ విజయాలు సాధించారు. ఇప్పటి వరకు థామస్ కప్లో ఒక్కసారి కూడా పతకం సాధించలేకపోయిన భారత్.. ఈ సారి ఆ కల నెరవేర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నది. గ్రూప్-‘సి’లో భాగంగా బుధవారం జరుగనున్న నామమాత్ర పోరులో చైనీస్ తైపీతో భారత్ తలపడనుంది. మరోవైపు ఉబర్ కప్లో కెనడాను చిత్తు చేసి ఘనంగా బోణీ కొట్టిన భారత మహిళల జట్టు.. మంగళవారం అమెరికాతో అమీతుమీ తేల్చుకోనుంది.