పాలక్కడ్, ఫిబ్రవరి 9: కేరళలోని మలప్పుజ సమీపంలో కొండ చీలికలో చిక్కుకుపోయిన యువకుడు బాబును భారత సైన్యం రక్షించింది. సోమవారం ఉదయం అతన్ని బయటకు తీసుకువచ్చింది. పగటి పూట ఎండ, రాత్రి విపరీతమైన మంచు, క్రూర మృగాలు ఉన్న కారణంగా బాబు బతకడం కష్టం అని అంతా భయపడ్డారు. యువకుడు సురక్షితంగా బయటపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎంఐ-17 హెలికాప్టర్లో బాబును పాలక్కడ్ జిల్లా దవాఖానకు తరలించారు. బాబు సోమవారం ఇద్దరు మిత్రులతో కలిసి మలప్పుజ సమీపంలోని కొండ శిఖరం ఎక్కే ప్రయత్నం చేశాడు.
మిగతా ఇద్దరు మధ్యలోనే వెనక్కు వెళ్లినా బాబు శిఖరం మీదకు చేరుకొన్నాడు. అయితే, కాలు జారడంతో కిందకు జారుతూ మధ్యలో కొండ చీలికలో చిక్కుకుపోయాడు. వెంటనే సహాయ చర్యలు ప్రారంభించినప్పటికీ పోలీసు, విపత్తు నిర్వహణా బృందాలు అక్కడికి చేరుకోలేకపోయాయి. 48 గంటలు యువకుడు తిండి, నీళ్లు లేక అక్కడే ఉన్నాడు. కేరళ సీఎం పినరాయి విజయన్ సైన్యం సహాయం కోరారు. ఆర్మీకి చెందిన సదరన్ కమాండ్ బుధవారం అతన్ని కాపాడింది. భారత సైన్యానికి బాబు, అతని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.