వాషింగ్టన్: వివిధ ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో భారతీయ సంతతి న్యాయవాది వాదించారు. ఆయన పేరు నీల్ కత్యాల్(Neal Katyal). 1977 నాటి అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఆధారంగా ట్రంప్ పలు దేశాలు పన్నుల మోత మోగించారు. అయితే ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ ట్రంప్కు వ్యతిరేకంగా న్యాయవాది నీల్ కత్యాల్ వాదించారు. ఆయన భారతీయ సంతతి వ్యక్తం కావడం గమనార్హం.
గతంలో కత్యాల్ అమెరికా యాక్టింగ్ సొలిసిటర్ జనరల్గా చేశారు. ట్రంప్ విధిస్తున్న సుంకాలు సహేతుకమైనవి కావని, రాజ్యాంగ వ్యతిరేక పన్నులు విధిస్తున్నారని ఆరోపించారు. చట్టానికి, అమెరికా ప్రజల పక్షాన సుప్రీంకోర్టు నిలబడినట్లు తీర్పు తర్వాత నీల్ కత్యాల్ అన్నారు. దేశాధ్యక్షులు శక్తివంతమైనవారే అని, కానీ రాజ్యాంగం అంతకన్నా శక్తివంతమన్నారు. కేవలం ఉభయ సభల ద్వారా మాత్రమే అమెరికా ప్రజలపై పన్నుభారం మోపే అవకాశాలు ఉన్నాయన్నారు. జాతీయ భద్రత, ఆర్థిక స్వాలంబనకు పన్నులు అవసరమని ట్రంప్ తెలిపారు. రాజ్యాంగంలో ఇదో కీలక మైలురాయి అని నీల్ కత్యాల్ అన్నారు. ఈ లీగల్ కేసులో సుప్రీంకోర్టు మనకు అన్నీ కల్పించిందన్నారు.
నీల్ కత్యాల్ చికాగోలో జన్మించారు. భారతీయ సంతతి కుటుంబంలో ఆయన పుట్టారు. న్యాయ విద్యను అభ్యసించిన కత్యాల్.. తన కెరీర్లో ఎక్కువగా రాజ్యాంగ కేసులను వాదించారు. డార్ట్మౌత్ కాలేజ్, యేల్ లా స్కూల్లో ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు. అమెరికా సుప్రీంకోర్టులో పనిచేసిన జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ వద్ద క్లర్క్గా చేశారు. 2010లో అధ్యక్షుడు బరాక్ ఒబామా దగ్గర తాత్కాలిక సొలిసిటర్ జనరల్గా చేశారు. ఫెడరల్ ప్రభుత్వం , అప్పిలెంట్ కోర్టుల తరపున ఆయన కేసులు వాదించారు. అమెరికా సుప్రీంకోర్టులో సుమారు 50కి పైగా కేసులను ఆయన వాదించారు. మైనార్టీ వర్గానికి చెందిన అడ్వకేట్లలో ఆయన రికార్డులను బ్రేక్ చేశాడు.
మిల్బ్యాంక్ ఎల్ఎల్పీలో ప్రస్తుతం భాగస్వామిగా ఉన్నారు. జార్జ్టౌన్ యూనివర్సిటీ న్యాయ కేంద్రంలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. రాజ్యాంగంతో పాటు కాంప్లెక్స్ అప్పిల్లేట్ లిటిగేషన్లో కత్యాల్ స్పెషలిస్ట్. 2017లో ట్రంప్ విధించిన ట్రావల్ బ్యాన్కు వ్యతిరేకంగా వోటింగ్ రైట్స్ యాక్ట్ ప్రకారం ఆయన ఓ కేసును వాదించారు. పర్యావరణ, జాతీయ భద్రత సంబంధిత కేసుల్లోనూ ఆయన వాదించారు. జార్జ్ ఫ్లాయిడ్ మర్డర్ కేసులో మిన్నసొట్ట రాష్ట్రం తరపున స్పెషల్ ప్రాసిక్యూటర్గా ఓ కేసును వాదించారు. ఇంపీచ్: ద కేస్ అగేనస్ట్ డోనాల్డ్ ట్రంప్ పుస్తకాన్ని ఆయన రాశారు. అమెరికా న్యాయశాఖ అందజేసే అత్యున్నత పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఎడ్మండ్ రండోల్ప్ అవార్డును ఆయన స్వీకరించారు. 2017, 2023లో మేటి అమెరికా లాయర్ అవార్డులను కూడా అందుకున్నారు. 2024, 2025 సంవత్సరాల్లో అమెరికాలోని మేటి 200 లాయర్ల ఫోర్బ్స్ జాబితాలో ఆయన ఉన్నారు.