దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మూడు మెగాటోర్నీలకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. రానున్న ఎనిమిదేండ్ల(2024-31)లో ప్రపంచకప్ టోర్నీల వేదికలను ఐసీసీ మంగళవారం అధికారికంగా ఖరారు చేసింది. ఇందులో భాగంగా 2026లో శ్రీలంకతో కలిసి భారత్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి వేదికవుతుండగా, 2029లో చాంపియన్స్ ట్రోఫీ, 2031లో భారత్, బంగ్లాదేశ్లో వన్డే ప్రపంచకప్ జరుగనుంది. ఎనిమిదేండ్ల వ్యవధిలో బీసీసీఐకి మూడు ప్రపంచ టోర్నీలను నిర్వహించే అవకాశం లభించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ 2025లో చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్నది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడి తర్వాత అంతర్జాతీయ సిరీస్లకు పాక్ దూరమైంది. మరోవైపు 2024 పొట్టి ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ వేదిక కాబోతున్నాయి. మొత్తంగా 14 సభ్య దేశాల్లో ఎనిమిది మెగాటోర్నీలు జరుగుతాయని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పేర్కొన్నాడు. మహిళల వన్డే, అండర్-19 ప్రపంచకప్లపై వచ్చే ఏడాది ఆరంభంలో ఖరారు చేయనున్నట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి.