న్యూఢిల్లీ: టీమ్ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమయ్యాడు. సఫారీ పర్యటనకు ముందు ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆదివారం రోహిత్ చేతికి గాయమైంది. దీంతో హిట్మ్యాన్ మూడు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వెల్లడించింది. అతడి స్థానంలో భారత-‘ఎ’జట్టు సారథి ప్రియాంక్ పాంచల్కు తొలిసారి టీమ్లో చోటు దక్కింది. ‘భారత టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమ చేతికి గాయమైంది. ఆదివారం ట్రైనింగ్ సెషన్లో అతడి చేతికి బంతి బలంగా తాకింది. దీంతో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు అతడు అందుబాటులో ఉండటం లేదు. రోహిత్ స్థానంలో ప్రియాంక్ జట్టుతో చేరతాడు’అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. రోహిత్ స్థానంలో లోకేశ్ రాహుల్ టెస్టు జట్టు వైస్కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలున్నాయి.
ప్రస్తుతానికి టెస్టు సిరీస్కే దూరమైన రోహిత్.. జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ వరకు కోలుకుంటాడా అనేది అనుమానంగా మారింది. ‘దెబ్బ తగిలిన తర్వాత కూడా రోహిత్ బ్యాటింగ్ కొనసాగించాడు. దీంతో గాయం చిన్నదే అయి ఉంటుందని భావించాం. కానీ ఆ తర్వాత దాని ప్రభావం తెలిసింది. ఇలాంటి సమయాల్లో పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఒక్కో సారి నాలుగు వారాల సమయం పడుతుంది. దీంతో అతడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరం కావాల్సిందే’అని బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే గాయం తీవ్రతపై ఇప్పుడప్పుడే అంచనాకు రావడం కష్టం కాగా.. బీసీసీఐ వైద్య బృందం హిట్మ్యాన్ను పర్యవేక్షిస్తున్నది. రోహిత్ గైర్హాజరీలో రాహుల్తో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సెంచూరియన్ వేదికగా ఈ నెల 26న భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
కోహ్లీ సారథ్యాన్ని ఆస్వాదించా: రోహిత్
ముంబై: టీమ్ఇండియా పరిమిత ఓవర్ల తాజా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యాన్ని చాలా ఆస్వాదించానని కొత్త నాయకుడు రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఐదేండ్లు విరాట్ నేతృత్వంలో ఆడిన రోహిత్.. అందులో ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీని వన్డే కెప్టెన్గా తప్పించిన బోర్డు అతడి స్థానంలో రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ సోమవారం మాట్లాడుతూ.. ‘విరాట్ నేతృత్వంలో భారత జట్టుకు ఆడటం చాలా గర్వంగా అనిపించేది. కోహ్లీతో ఆడేటప్పుడు ఆటను బాగా ఎంజాయ్ చేస్తాం. ఐదేండ్ల పాటు విరాట్ జట్టును ముందుండి నడిపించాడు. అతడి నేతృత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
విరాట్ ఎంతో అంకితభావంతో ఉంటాడు.. ప్లేయర్లకు కూడా అదే చెప్పేవాడు. దాంతో జట్టు వరుసగా మంచి విజయాలు సాధించింది. జట్టుగా మేం వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా చేశాడు. రానున్న రోజుల్లో మేం మరింత మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలి. దాని కోసం అందరం కలిసి కష్టపడతాం. కఠిన సవాళ్లు ఎదుర్కొనేందుకు తగ్గట్లుగా సిద్ధమవుతాం. ఇటీవలి కాలంలో 10 పరుగులకే మూడు వికెట్లు.. 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన వంటి సందర్భాల్లో జట్టు తిరిగి కోలుకోలేకపోయింది. అలాంటివాటిని అధిగమించి ముందుకు సాగాల్సి ఉంది. ఆటగాళ్ల బాధ్యతలను వారికి వినిపించి మెరుగైన ప్రదర్శన రాబట్టేందుకు కృషి చేస్తాం’అని అన్నాడు.
లక్కీ చాన్స్..
రోహిత్ గాయపడటంతో అతడి స్థానంలో యువ ఓపెనర్ పృథ్వీ షాను కాకుండా.. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న ప్రియాంక్ పాంచల్ వైపు బీసీసీఐ మొగ్గుచూపింది. టీమ్ఇండియా సఫారీ పర్యటనకు ముందు.. భారత-‘ఎ’జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించగా.. దానికి ప్రియాంక్ నాయకత్వం వహించాడు. మూడు మ్యాచ్ల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసిన ప్రియాంక్.. దేశవాళీల్లో 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడి 7 వేలకు పైగా పరుగులు చేశాడు. అందులో 24 సెంచరీలు ఉన్నాయి. గుజరాత్ జట్టు రంజీ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ప్రియాంక్.. భారత-‘ఎ’కెప్టెన్ గాను మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన ఈ యువ క్రికెటర్ సోమవారమే జట్టుతో చేరగా.. మూడు రోజుల క్వారంటైన్ అనంతరం టీమ్ఇండియా సఫారీ టూర్కు బయలుదేరనుంది.