న్యూఢిల్లీ : రాబోయే ఐదేళ్లలో దేశంలో 100 భూకంప అబ్జర్వేటరీలు నిర్వహించనున్నామని, ఈ ఏడాది చివరి నాటికి 35 ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎర్త్ సైన్స్ మినిస్టర్ జితేంద్రసింగ్ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గత ఆరున్నర దశాబ్దాలలో దేశంలో 115 భూకంప అబ్జర్వేటరీలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య భాగా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ జియోమాగ్నెటిజం అండ్ ఏరోనోమీ (IAGA) – ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సీస్మోలజీ అండ్ ఫిజిక్స్ ఆఫ్ ది ఎర్త్ ఇంటీరియర్ (IASPEI) జాయింట్ సైంటిఫిక్ అసెంబ్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.
భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, తుఫానులు, వరదలు, సునామీలు తదితర అత్యంత విపత్తు సంభవించే ప్రాంతాల్లో భారత ఉపఖండం ప్రపంచంలోనే ఒకటిగా పరిగణించబడుతుందన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఐఏజీఏ-ఐఏఎస్ పీఈఐ సంయుక్త శాస్త్రీయ అసెంబ్లీ సమాజానికి సైన్స్ను అందించేందుకు, సంబంధించిన సమస్యలపై పని చేసేందుకు ప్రపంచ సమాజానికి చెందిన పరిశోధకులు, అభ్యాసకులను అధిక సంఖ్యలో తీసుకురావడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.