న్యూఢిల్లీ : భారత్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానున్నది. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఢిల్లీ – ముంబై మధ్య నిర్మాణమవుతోంది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎక్స్ప్రెస్ వే పొడవు 1,380 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (JNPT) వరకు వెళ్తుందని, అయితే.. దీన్ని నారిమన్ పాయింట్ వరకు వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు.
గతంలో ట్రక్ ద్వారా ముంబై – ఢిల్లీ మధ్య ప్రయాణానికి 48 గంటలు, కారులో అయితే 24-26 గంటల సమయం సమయం పడుతుండేదని, అందుబాటులోకి వస్తే కారులో 12-13 గంటల్లో, ట్రక్లో 18-20 గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని గిరిజన జిల్లాల నుంచి ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతోందని, దీంతో ఆయా ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజలకు అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని వెల్లడించారు. ఈ ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ-ఫరీదాబాద్-సోహ్నా సెక్షన్తో పాటు జెవార్ విమానాశ్రయం, జవహర్లాల్ నెహ్రూ పోర్టును ముంబైలోని సరఫ్ ద్వారా కలుపుతుందని వివరించారు.