ప్రపంచ ఆకలి సూచీలో ఇండియాకు 101వ ర్యాంకు. మొత్తం 116 దేశాల్లో సర్వే చేయగా ఇందులో భారత్ 27.5 స్కోర్తో101వ స్థానంలో నిలవడం గమనార్హం. గతేడాది భారత్ 94వ స్థానంలో నిలువగా ఈ ఏడాది 7 ర్యాంకులు దిగజారడం గమనార్హం. భారత్తో పోల్చితే పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు మెరుగైన స్థానంలో ఉన్నాయి. చైనా, బ్రెజిల్, చిలీతో పాటు 18 దేశాలు జీహెచ్ఐ స్కోర్ 5తో ఒకటో స్థానంలో నిలిచాయి. 2000 సంవత్సరంలో భారత్ జీహెచ్ఐ స్కోర్ 38.8 ఉండగా 2006లో 37.4 ఉన్నది. ఇప్పుడు ఇది కాస్త తగ్గుతూ 27.5కి పడిపోయింది. 27.5 జీహెచ్ఐ స్కోర్ భారత్లో ఆకలి కేకలు చాలా సీరియస్గా ఉన్నట్లు సర్వే పేర్కొన్నది.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు అత్యంత దారుణంగా ఉన్నదని, ఇంకా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిసిగ్గుగా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన సీఎం.. ‘కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు, ఆయన మాట్లాడటానికి నోరు ఎట్ల వస్తదో తెలియదు. హీ మస్ట్ బీ ఆషేమ్డ్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచిక)లో ప్రపంచంలోని 116 దేశాలను సర్వే చేస్తే ఇండియాకు 101 ర్యాంకు వచ్చింది. మీకు ఏమైనా సిగ్గు, లజ్జ ఉంటే కండ్లు తెరవండి.. కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్. పాకిస్థాన్ ర్యాంకు 92, బంగ్లాదేశ్, నేపాల్ 76 ర్యాంకు. ఇది మన బతుకు’ అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అన్నపు రాశులు ఓ వైపు.. ఆకలి కేకలు ఓ వైపు
‘అప్పట్లో విప్లవ కవి అన్నాడు.. అన్నపు రాశులు ఒక వైపు, ఆకలి కేకలు ఇంకో వైపు అని. రాసినట్టుగానే ఉన్నది ఇప్పటి కథ. సామాజిక బాధ్యత ఉంటే కేంద్రం.. ధాన్యం తీసుకొని ఆకలి ఉన్న బిడ్డలకు పంచు, ఉచిత బియ్యం పంచు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వాస్తవమా కాదా? అని కేంద్రాన్ని కేసీఆర్ నిలదీశారు. బీజేపీ పరిపాలనలో 2016లో ఇండియా 96వ స్థానంలో ఉండ గా ఇప్పుడది 101కి దిగజారిందని ఎద్దేవా చేశా రు. బీజేపీ ప్రభుత్వంలో ఆకలి కేకలు పెరిగాయ ని, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మన మొఖం మీద ఉమ్మేసినట్టుగా ఉన్నదని చెప్పారు. ‘ఇవన్నీ ఇట్ల ఉంటే.. మాకు చాత కాదు, మాకు కొనటం ఇష్టం లేదు, మేం ఆదానీ, అంబానీలకు అప్పజెప్పదలుచుకొన్నా’మంటున్నదని బీజేపీని ఉద్దేశించి కేసీఆర్ ఫైర్ అయ్యారు.
దేశంలో పేదరికంలోకి 7.5 కోట్ల మంది
కరోనా సమయంలో దేశంలో పేదరికం భారీగా పెరిగినట్టు ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది. చైనాతో పోల్చితే మన దేశంలో పేదరికం భారీగా పెరగటం గమనార్హం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఆదాయం గల ప్రజలు పూర్తిగా పేదరికంలోకి కూరుకుపోయినట్టు వెల్లడించింది. మొత్తంగా భారత్లో 7.5 కోట్ల మంది కడుపేదరికంలోకి జారిపోగా చైనాలో 10 లక్షల మంది మాత్రమే పేదలుగా మారినట్టు వివరించింది. ఈ నివేదిక ప్రకారం భారత్లో కొవిడ్ తర్వాత మధ్యతరగతి ఆదాయం గలవారు 3.2 కోట్ల మంది తగ్గగా, దిగువ తరగతి ఆదాయం గలవారు 3.5 కోట్లు తగ్గారు. వీరంతా కడు పేదరికంలోకి వెళ్లటంతో పేదల సంఖ్య 7.5 కోట్లకు పెరిగారు. అదే చైనాలో కడు పేదరికంలోని పేదలు తగ్గి, దిగువ తరగతి ఆదాయం గల ప్రజలు ఒక కోటి మంది పెరగటం గమనార్హం.