Wular Barrage : జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలోని జీలం నదిపై నాలుగు దశాబ్దాలుగా నిలిచిపోయిన వులార్ బ్యారేజ్ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఇక ప్రాజెక్టును తిరిగి ప్రారంభించే చర్యలు మొదలయ్యాయి. పహల్గాంపై పాక్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా గత ఏడాది రద్దు చేసుకుంది. ప్రపంచ బ్యాంకు సూచన మేరకు 1960లలో ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ గతేడాది ప్రకటించింది.
దీంతో మన దేశం నుంచి పాకిస్తాన్ వెళ్లే నదులకు సంబంధించిన ప్రాజెక్టుల్ని నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. గతంలో ఈ ప్రాజెక్టుల్ని చేపడితే నాటి ఒప్పందాన్ని సాకుగా చూపి పాక్ అడ్డుపడేది. దీంతో భారత సరిహద్దు, జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలోని జీలం, చీనాబ్, సింధు వంటి నదుల పరిధిలో పలు ప్రాజెక్టులు ఆగిపోయాయి. అయితే, ఒప్పందం రద్దు నిర్ణయం ఇండియాకు భారీ ప్రయోజనం కలిగిస్తోంది. ఒప్పందం రద్దు కావడంతో దశాబ్దాలుగా ఆగిపోయిన ప్రాజెక్టులకు ఇప్పుడు మోక్షం కలుగుతోంది. ఈ నేపథ్యంలో జీలం నదిపై నిర్మించ తలపెట్టిన వులార్ బ్యారేజ్ను జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నది నీటిని నిల్వ చేసి, ఈ ప్రాంత వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాలకు వాడుతారు.
1980లలో ప్రారంభించిన వులార్ బ్యారేజ్ ప్రాజెక్టును 1987లో పాక్ ఒత్తిడితో నిలిపివేశారు. ఆ తర్వాత పలుమార్లు ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పటికీ పాక్తో సింధు జలాల ఒప్పందం వల్ల ముందుకు కదల్లేదు. చివరగా 2012లో ఈ పనులు నిలిచిపోయాయి. అప్పట్లో పాక్ తీవ్రవాదులు ఈ అంశంపై హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ నిర్మాణం చేపడితే కూల్చివేస్తామని హెచ్చరించడంతో కార్మికుల భద్రతరీత్యా నిలిపివేశారు. అయితే, ఈ ప్రాజెక్టును ఇప్పుడు తిరిగి ప్రారంభించేందుకు జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయి. ఈ అంశాన్ని జమ్మూ-కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇటీవలే ప్రకటించారు.
త్వరలోనే తిరిగి పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ ప్రాంతంలో ఏడాదంతా నీటి కొరత ఉండదు. అలాగే స్థానికులకు నిర్మాణ పరంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయి.