న్యూఢిల్లీ, జనవరి 5: ఇండియాలో ఒమిక్రాన్తో తొలి మరణం నమోదు అయింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన ఓ వృద్ధుడు(73) ఒమిక్రాన్తో చనిపోయాడు. జ్వరం, న్యూమోనియా లక్షణాలతో వృద్ధుడు దవాఖానకు వెళ్లగా డిసెంబర్ 15న పరీక్షలు చేశారు. కరోనా అని తేలడంతో జన్యు విశ్లేషణకు పంపించారు. ఒమిక్రాన్ అని నిర్ధారణ అయింది. అయితే డిసెంబర్ 21, 25 తేదీల్లో రెండు సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అనారోగ్యంతో వృద్ధుడు డిసెంబర్ 31న చనిపోయాడు. ‘సాంకేతికంగా చూస్తే ఆ వృద్ధుడు ఒమిక్రాన్తోనే చనిపోయారు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ బుధవారం ధ్రువీకరించారు. దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ తీవ్రమవుతున్నది. 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 58,097 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 534 మంది కరోనాతో చనిపోయారు. పాజిటివిటీ రేటు 5.03 గా ఉంది. 2.14 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఇండియాలో 2,135 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 26,538 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ముంబైలోనే 15,166 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్కరోజులో నమోదైన కేసుల పరంగా ముంబైలో ఇదే రికార్డు. మరోవైపు, ఢిల్లీలో బుధవారం 10,665 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు ఢిల్లీలో దాదాపు 12 శాతం ఉంది.
సెకండ్ వేవ్ను మించిన ఆర్ నాట్
దేశంలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్రప్రభుత్వం తెలిపింది. దీనికి ఒమిక్రాన్ వేరియంటే కారణం అని భావిస్తున్నట్టు పేర్కొన్నది. వైరస్ వ్యాప్తి రేటు(ఆర్ నాట్) 2.69గా ఉన్నదని వెల్లడించింది. సెకండ్ వేవ్లో ఆర్ నాట్ గరిష్ఠ విలువ 1.69 కాగా దాన్ని మించి ప్రస్తుతం కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నదని పేర్కొన్నది. ఎనిమిది రోజుల్లో కరోనా కేసులు 6.3 రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్క మంగళవారమే 25.2 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కట్టడికి తమిళనాడు, హిమాచల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. ఒమిక్రాన్ ఉద్ధృతి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ ఆంక్షలు విధించింది. ఇండియా సహా ఎనిమిది దేశాల నుంచి వెళ్లే విమానాలపై రెండు వారాల పాటు నిషేధం ఉంటుందని ప్రకటించింది.
గర్భిణులకు టీకా సురక్షితమే
గర్భిణులకు కరోనా టీకా సురక్షితమైనదేనని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. టీకా వేసుకొంటే ఆ ప్రభావం కడుపులోని పిల్లలపై ఉండబోదని పేర్కొన్నారు. నెలలు నిండకుండానే జన్మించడం, బరువు తక్కువగా పుట్టడం లాంటి సమస్యలకు కరోనా టీకాకు ఎలాంటి సంబంధం లేదని నొక్కి చెప్పారు.
నాసల్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న నాసల్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు డీసీజీఐకి చెందిన నిపుణుల కమిటీ బుధవారం అనుమతి తెలిపింది. కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు డోసులు వేసుకొన్నవారికి దీనిని బూస్టర్ డోసుగా వేయడంపైన కూడా భారత్ బయోటెక్ ట్రయల్స్ చేయనున్నది.
అదే టీకా.. మార్పు లేదు
మూడో డోసుపై కేంద్రం నిర్ణయం
హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ముందు జాగ్రత్త డోసుగా(మూడో డోసు)గా ఏ టీకా వేయాలన్నదానిపై కేంద్రం నిర్ణయం తీసుకొన్నది. మొదటి రెండు డోసులు ఏ టీకా తీసుకొన్నారో అదే టీకాను వేయనున్నట్టు ప్రకటించింది. వీరికి మూడో డోసు వ్యాక్సినేషన్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నది.
కొవాగ్జిన్తో పారాసిటమాల్ అవసరంలేదు
కొవాగ్జిన్ టీకా వేసుకొన్న తర్వాత పారాసిటమాల్ లేదా పెయిన్ కిల్లర్లను తీసుకోవాల్సిన అవసరంలేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. పిల్లలకు కొవాగ్జిన్ టీకా వేశాక.. 500 ఎంజీ పారాసిటమాల్ మూడు గోలీలను కొన్ని టీకా కేంద్రాల్లో ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. అయితే తమ టీకా వేసుకొన్న తర్వాత ఏ ఔషధాలను వాడాల్సిన అవసరం లేదని పేర్కొంది.