న్యూఢిల్లీ: భారతదేశంలో దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్ల విక్రయంలో సక్సెస్ అయితే, దేశంలోనే కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేర్కొన్నారు.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కార్ల మార్కెట్గా భారత్ నిలుస్తున్నది. ఈ తరుణంలో ముందు దిగుమతి చేసుకున్న కార్లపై దిగుమతి సుంకాల తగ్గింపునకు టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ జరుపుతున్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు.
దిగుమతి సుంకాలను తగ్గిస్తే, భారత్లో తమ మార్కెట్ను విస్తరించే ప్రణాళికను అమలు చేయాలని యోచిస్తున్నట్లు ఎలన్ మస్క్ పేర్కొన్నారు. క్లీన్ ఎనర్జీ వెహికల్స్, డీజిల్ లేదా పెట్రోల్ వినియోగ వాహనాలను ఒకేలా చూస్తున్నారన్నారు. భారత్ తన భూతాప నివారణ లక్ష్యాలను చేరాలంటే ఈ విధానాలు ఉపకరించబోవన్నారు.