Raw intelligence | సినిమాలో హీరో ఓ రక్షణ అధికారి ! దేశంలో దాడులకు ఉగ్రవాదులకు భారీ ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ ద్వారా అతను తెలుసుకుంటాడు ! ఉగ్రవాదులపై ఎటాక్ చేసి.. వాళ్ల బారి నుంచి దేశాన్ని రక్షిస్తాడు. ఇంకో సినిమాలో హీరో ఓ గూఢచారి.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్లి ఉగ్రవాదులతో కలిసిపోతాడు. తీవ్రవాదులతోనే ఉంటూ రహస్యంగా వాళ్ల ప్లాన్స్ తెలుసుకుని వాటిని భగ్నం చేస్తాడు. ఇలాంటి సాహసాలు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ చేసే అధికారులు ఉన్నారు. దేశ రహస్యాలు శత్రువుల చేతికి చిక్కకుండా కాపాడటం, ఉగ్రవాదుల కుట్రలను ముందుగానే తెలుసుకుని వాటిని అడ్డుకోవడానికి ఒక ఇంటెలిజెన్స్ విభాగం ఉంది. అదే.. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్. దీన్నే రా ఏజెన్సీ అని కూడా పిలుస్తారు. వీళ్లు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తారు. మరి ఇలాంటి ఏజెన్సీలు వేరే దేశాల్లో కూడా ఉన్నాయా? అవి ఎప్పుడు ఏర్పాటయ్యాయి? మన దేశంలో అసలు రా ఎందుకు ఏర్పాటైంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రిటీష్ పాలనలో ఉన్న సమయంలో దేశ భద్రత కోసం 1933లో అప్పటి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)ను ఏర్పాటు చేసింది. 1947లో భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే కొనసాగింది. అప్పుడు దీనికి సంజీవ్ పిళ్లై డైరెక్టర్గా నియమితులయ్యారు. కానీ అప్పటికే ఐబీలో ఉన్న చాలామంది అధికారులు.. స్వతంత్రం రాగానే తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయారు. దీంతో మిగిలిన బృందంతోనే సంజీవ్ పిళ్లై ఐబీని కొనసాగించారు. యూకే ఇంటెలిజెన్స్ విధానాలను అనుసరిస్తూ చిన్నపాటి ఫారెన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ను నిర్వహించారు. కానీ 1962లో చైనాతో యుద్ధాన్ని అడ్డుకోవడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో విఫలమైంది. దీంతో భారత్కు ఒక శక్తివంతమైన నిఘా సంస్థ అవసరమని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారు. కొత్త నిఘా సంస్థ ఏర్పాటుకు అధికారాలను ఆదేశించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
అప్పటికే ఉన్న ఇంటెలిజెన్స్ లోపాల కారణంగా 1965లోనూ పాకిస్థాన్తోనూ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధం తర్వాత జనరల్ జొయంతో నాథ్ చౌధురీ కూడా బలమైన ఇంటెలిజెన్స్ ఆవశ్యకతను గుర్తు చేశారు. దీంతో 1966లో ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. ఇందిరాగాంధీ హయాంలో ఐబీకి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన ఆర్.ఎన్.కావ్ ఏజెన్సీ ఏర్పాటుకు బ్లూప్రింట్ సిద్ధం చేశారు. అది ప్రభుత్వానికి నచ్చడంతో ఆయన్నే చీఫ్గా నియమిస్తూ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ( రా )ను ఏర్పాటు చేశారు. 1968 సెప్టెంబర్ 21న ఇది ఏర్పాటైంది. విదేశాల నుంచి రహస్య సమాచారాలు సేకరించడం, ఉగ్రదాడులు, ఆక్రమణలను నిరోధించడం, చట్ట సభ్యులకు సలహాలు ఇవ్వడం వంటివి రా విధులు. న్యూక్లియర్ ప్రోగ్రామ్కు భద్రత కల్పించే బాధ్యత కూడా రా దే. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
అమెరికా ఇంటెలిజెన్స్ విభాగాన్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ( సీఐఏ ) అని పిలుస్తారు. ఇది 1947 సెప్టెంబర్ 18న ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం వర్జీనియాలో ఉంది. అగ్రరాజ్యంగా అమెరికా కొనసాగడం వెనుక.. సీఐఏ కృషి ఎంతగానో ఉందనే చెప్పాలి. అమెరికాలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా ఈ ఏజెన్సీ చూసుకుంటుంది. గూఢచర్యం చేస్తూ.. అమెరికాకు వచ్చే ఆపదలను ముందుగానే పసిగట్టి.. వాటిని అడ్డుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా భద్రతకు సంబంధించిన ఏ విషయాలు సేకరించినా.. ఆ నివేదికలను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు సమర్పించాల్సి ఉంటుంది.
భారత్కు రా ఏజెన్సీ ఉన్నట్టే పాకిస్థాన్కు కూడా ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది. దాని పేరే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ( ఐఎస్ఐ ). దీని ప్రధాన కార్యాలయం ఇస్లామాబాద్లో ఉంది. ఐఎస్ఐ 1948 జనవరి 1న ఏర్పాటైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఆర్మీ, నేవీ, వైమానిక బలగాల్లోని అధికారులు సభ్యులుగా ఉంటారు. విదేశాల నుంచి తమ దేశానికి ఏదైనా ప్రమాదం ఉందా అనే విషయాలను ఈ ఏజెన్సీ రహస్యంగా సేకరిస్తూ ఉంటుంది. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. ఉగ్రవాదులతో చేతులు కలిపి భారత్పై దాడులకు పాల్పడుతుందని అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇస్లామాబాద్లోని ఆబ్పరాలో 1948 జనవరి 1న ఏర్పాటైంది.
దేశ భద్రతతో పాటు రహస్యాలను వెలికితీయడం కోసం చైనాలో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ కంటే ముందు దీని స్థానంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ 9 ( సీఐడీ ) ఉండేది. అయితే సీఐడీ, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను 1983 జూలై 1న కలిపేసి.. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. చైనాకు వ్యతిరేకంగా పనిచేసే ఏజెంట్లను, గూఢచారులను పట్టుకునేందుకు శతవిధాల కృషి చేస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో యునైటెడ్ కింగ్డమ్ ఒకటి. 1569లో తొలిసారి సీక్రెట్ సర్వీస్ పేరుతో ఇది ఏర్పాటైంది. క్వీన్ ఎలిజబెత్ 1కు సెక్రటరీగా పనిచేసిన సర్ ఫ్రాన్సిస్ వాల్సింగమ్ దీన్ని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఇది ఎన్నో రకాలుగా మారింది. 1909లో సీక్రెట్ సర్వీస్ బ్యూరోగా ఉన్న ఈ ఏజెన్సీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1920లో ఎస్ఐఎస్ ఎంఐ6గా మారింది. ఉగ్రవాదం అణిచివేత, ఆక్రమణలు, సైబర్ సెక్యూరిటీ వంటి విషయాల్లో ఇది కీలకంగా పనిచేస్తుంది. సీఐఏతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇది సాయం చేస్తూ ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది.
మొసాద్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ అని అర్థం. ఇజ్రాయెల్కు చెందిన ఈ మొసాద్.. ఉగ్రవాదాన్ని నిరోధించడం, సమాచారం సేకరించడం వంటి పనులు చేస్తుంటుంది. కోవర్ట్ ఆపరేషన్లు కూడా చేస్తుంది. ప్రపంచంలో అత్యంత సాహసోపేత అండర్కవర్ ఆపరేషన్స్లోనూ ఈ ఏజెన్సీ కీలక పాత్ర పోషించింది. ఇజ్రాయెల్ రాజ్యాంగానికి, చట్టానికి అతీతంగా పనిచేసే అధికారాలు ఈ ఏజెన్సీకి ఉంటాయి. దీన్ని 1949 డిసెంబర్ 13న ఏర్పాటు చేశారు.
ఆస్ట్రేలియా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ 1952 మే 13న ప్రారంభమైంది. ఇది ఆస్ట్రేలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ ఆఫైర్స్ అండ్ ట్రేడ్ డిపార్ట్మెంట్లో భాగంగా పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం కాన్ బెర్రాలో ఉంది. గూఢచారుల నుంచి సేకరించిన రహస్యాల నివేదికను విదేశాంగ శాఖ మంత్రికి నేరుగా అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గూఢచారుల నుంచి రహస్య సమాచారాన్ని సేకరించడంలో ఆస్ట్రేలియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ముందుంటుంది. ఇతర దేశాల ఏజెన్సీలతో కలిసి ఇది పనిచేస్తుంది.
ఫ్రాన్స్కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టరేట్ జనరల్ ఫర్ ఎక్సటర్నల్ సెక్యూరిటీ సంస్థ బ్రిటన్కు చెందిన ఎంఐ6, అమెరికా సీఐఏతో సమానంగా పనిచేస్తుంటుంది. ఫ్రాన్స్ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏజెన్సీ పనిచేస్తుంది. ఇది 1982 ఏప్రిల్ 2న ఏర్పాటైంది. పారా మిలటరీ నిర్వహణ, శత్రువుల కుయుక్తులను తిప్పికొట్టే ఆపరేషన్స్లో డీజీఎస్ఈ దిట్ట.
ది ఫెడరల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ 1956 ఏప్రిల్ 1న బెర్లిన్లో ఏర్పాటైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధాన కార్యాలయం కలిగిన ఏజెన్సీ ఇదే. జర్మనీతో పాటు విదేశాల్లో 300 చోట్ల ఈ ఏజెన్సీ పనిచేస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాదం, ఆయుధాలు.. సాంకేతికత అక్రమ రవాణా వంటి అంశాల్లో రహస్యాలను ఈ నిఘా సంస్థ సేకరిస్తుంటుంది. అలా సేకరించిన రహస్యాలను నేరుగా ఛాన్స్లర్కు అందజేస్తుంది.
దేశీయంగా దాడులు, నేరాలను అడ్డుకునేందుకు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ను రష్యా ఏర్పాటు చేసింది. దేశ అంతర్గత భద్రత, ఘర్షణలు ప్రణాళికతో చేసే నేరాలు, ఉగ్రదాడులను ముందుగానే పసిగట్టి నిలువరించడంలో ఈ ఏజెన్సీ తలమునకలైపోతుంది. 2011లో ఈ ఏజెన్సీ 94 ఉగ్రదాడులను అడ్డుకుంది. ఎఫ్ఎస్డీ ప్రధాన కార్యాలయం మాస్కోలో ఉంది. గతంలో రష్యా సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు ఈ ఏజెన్సీ కమిటీ ఫర్ స్టేట్ సెక్యూరిటీ పేరుతో పనిచేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇండియాలో రోజురోజుకూ పెరుగుతున్న సంతానలేమి సమస్య.. తప్పెవరిది?
డ్రోన్లకు బ్రెయిన్.. సైంటిస్టుల సరికొత్త ప్రయోగం.. దేనికోసం వాడనున్నారంటే?
భూమిపై మార్స్ వాతావరణం సృష్టి.. ఎలా ఉంటుందో చూస్తారా?