సొంతగడ్డపై టీమ్ఇండియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. టెస్టు క్రికెట్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో కోహ్లీసేన.. భారత గడ్డపై వరుసగా 14వ టెస్టు సిరీస్ చేజిక్కించుకుంది! కొండంత లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ మూడో రోజే సగం వికెట్లు చేజార్చుకొని చేతులెత్తేయగా.. మిగిలిన ఐదు వికెట్లు పడగొట్టేందుకు సోమవారం మన వాళ్లకు డజను ఓవర్లు కూడా పట్టలేదు. అశ్విన్, జయంత్ చెరో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోవడంతో గంటలోపే కివీస్ పోరాటం ముగిసింది. కోచ్గా బాధ్యతలు చేపట్టాక టీ20 సిరీస్ నెగ్గిన రాహుల్ ద్రవిడ్.. టెస్టు ఫార్మాట్లోనూ బోణీ కొట్టాడు! స్వదేశంలో సూపర్ సక్సెస్ అయిన కోచింగ్ స్టాఫ్కు ఈ నెలాఖరున దక్షిణాఫ్రికా పర్యటనలో అసలు సిసలు పరీక్ష ఎదురు కానుంది!
ముంబై: అంతా అనుకున్నట్లే జరిగింది! భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ ఏమాత్రం పోరాట పటిమ కనబర్చకుండా పరాజయాన్ని ఆహ్వానించింది. సోమవారం 11.3 ఓవర్లలోనే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయి.. టీమ్ఇండియాకు భారీ విజయాన్ని కట్టబెట్టింది. 540 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 140/5తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్.. మరో 27 పరుగులు మాత్రమే జోడించి 167 పరుగుల వద్ద ఆలౌటైంది. 43 నిమిషాల్లోనే ముగిసిన ఆటలో.. హెన్రీ నికోల్స్ (44) కాస్త పోరాడగా.. రచిన్ రవీంద్ర (18), కైల్ జెమీసన్ (0), టిమ్ సౌథీ (0), సోమర్విల్లె (1) పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా టీమ్ఇండియా 372 పరుగుల తేడాతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్నందుకోవడంతో పాటు 1-0తో సిరీస్ చేజిక్కించుకుంది. ఇరు జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. మయాంక్ అగర్వాల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, అశ్విన్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.
భారత క్రికెట్ను ఉన్నత శిఖరాలకు చేర్చాలనే మైండ్సెట్తోనే కొత్త కోచింగ్ బృందం ముందుకు సాగుతున్నది. దక్షిణాఫ్రికా పర్యటన సవాళ్లతో కూడుకున్నదే అయినా.. మేం ఎక్కడైనా గెలువగలమనే నమ్మకముంది. మా బౌలర్లు ఎంతగానో ప్రయత్నించినా.. కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ మ్యాచ్ను కాపాడుకుంది. రహానే ఫామ్ గురించి జడ్జ్ చేయలేను. నేనే కాదు ఎవరూ ఆ పని చేయలేరు. తమ లోపాలేమిటి? వాటిని ఎలా అధిగమించాలన్న అంశంపై ఆ ఆటగాడే దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే కీలక మ్యాచ్ల్లో తమ ప్రదర్శనతో ప్రభావం చూపగల ఆటగాళ్లకు కష్టకాలంలో మద్దతుగా నిలబడాల్సి ఉంటుంది. విశ్రాంతి తర్వాత తిరిగి బరిలోకి దిగిన మ్యాచ్లోనే విజయం సాధించడం ఆనందంగా ఉంది. సిరాజ్ ప్రతిభావంతుడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టుకు బ్రేక్ అందించే సత్తువ అతడిలో ఉంది.
-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్
జట్టు ఎంపిక తీయటి తలనొప్పిగా మారింది. యువ ఆటగాళ్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎవరినైనా జట్టు నుంచి తప్పించడం కాస్త ఇబ్బందికరమే. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అయితే వాటిని సరైన రీతిలో ఆటగాళ్లకు వివరించడం ముఖ్యం. సిరీస్ విజయం ఆనందాన్నిచ్చింది. కాన్పూర్ టెస్టులో ఆఖరి వికెట్ పడగొట్టలేకపోవడం కాస్త నిరాశకు గురిచేసినా.. యువ ఆటగాళ్లు బాగా ఆడారు. మయాంక్, శ్రేయస్, సిరాజ్, అక్షర్కు ఎక్కువ టెస్టులు ఆడే చాన్స్లు రాకపోయినా.. వచ్చిన అవకాశాలను వాళ్లు వాడుకున్న విధానం బాగుంది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ ఆలౌటయ్యాక.. బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసమే రెండో ఇన్నింగ్స్ బరిలో దిగాం.
-రాహుల్ ద్రవిడ్, భారత్ చీఫ్ కోచ్
పేర్లు రెండు.. ప్లేయర్లు నలుగురు
ఈ ఫొటోలో ఉన్నది నలుగురు ఆటగాైళ్లెనా.. పేర్లు మాత్రం రెండుగానే కనిపిస్తున్నాయి కదా! భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సోమవారం ముంబైలో ముగిసిన రెండో టెస్టు అనంతరం ఇరు జట్లకు చెందిన నలుగురు ఆటగాళ్లు తమ జెర్సీపై ఉన్న పేర్లతో ఇలా కనికట్టు చేశారు! అక్షర్ పటేల్, అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా ఎడమ నుంచి వరుసగా నిల్చోగా.. వారి జెర్సీ నంబర్లతో పాటు అక్షర్, పటేల్, రవీంద్ర, జడేజా అనే పేర్లు దర్శనమిచ్చాయి. ఈ ఫొటోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర భారత సంతతికి చెందిన ఆటగాళ్లే అన్న విషయం తెలిసిందే. అజాజ్ ముంబైలో పుట్టి కుటుంబంతో కలిసి న్యూజిలాండ్లో స్థిరపడగా.. రచిన్ తల్లిదండ్రులు బెంగళూరును వీడి కివీస్లో సెటిల్ అయ్యారు.
అగ్రస్థానానికి..
సంపూర్ణ ఆధిపత్యంతో న్యూజిలాండ్పై సిరీస్ విజయం సాధించిన టీమ్ఇండియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తాజా ర్యాంకింగ్స్లో భారత్ 124 పాయింట్లతో టాప్కు చేరగా.. న్యూజిలాండ్ 121 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2021-23 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన కోహ్లీసేన.. 42 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
14 స్వదేశంలో టీమ్ఇండియాకు ఇది వరుసగా 14వ టెస్టు సిరీస్ విజయం. క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అత్యధికం. గతంలో ఆస్ట్రేలియా రెండు సార్లు వరుసగా 10 టెస్టు సిరీస్లు నెగ్గింది.
1 అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ 50 విజయాలు సాధించిన తొలి కెప్టెన్గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. టెస్టు ఫార్మాట్లో సారథిగా కోహ్లీకిది 50వ విజయం కాగా.. వన్డేల్లో 153, టీ20ల్లో 59 విజయాలు అతడి పేరిట ఉన్నాయి.
టెస్టు క్రికెట్లో పరుగుల (372) పరంగా భారత్కిదే అతిపెద్ద గెలుపు. 2015 ఢిల్లీ టెస్టులో దక్షిణాఫ్రికాపై సాధించిన 337 పరుగుల విజయం రెండో స్థానానికి చేరింది. మరోవైపు న్యూజిలాండ్ టెస్టు చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద పరాజయం.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రిచర్డ్ హ్యాడ్లీ (65)ని వెనక్కి నెట్టి అశ్విన్ (66) అగ్రస్థానానికి చేరాడు.
సొంతగడ్డపై 300 టెస్టు వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా అశ్విన్ నిలిచాడు. కుంబ్లే (350) ముందున్నాడు. ఓవరాల్గా మురళీధరన్ (493), అండర్సన్ (402), కుంబ్లే, బ్రాడ్ (341), వార్న్ (319) తర్వాత అశ్విన్ ఆరో ప్లేస్లో ఉన్నాడు.
2 టెస్టు క్రికెట్లో అత్యధిక (9) మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్వస్ కలిస్తో కలిసి అశ్విన్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. మురళీధరన్ (11) టాప్లో ఉన్నాడు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 325, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62, భారత్ రెండో ఇన్నింగ్స్: 276/7 డిక్లేర్డ్, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) అశ్విన్ 6, యంగ్ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) అశ్విన్ 20, మిచెల్ (సి) జయంత్ (బి) అక్షర్ 60, టేలర్ (సి) పుజారా (బి) అశ్విన్ 6, నికోల్స్ (స్టంప్డ్) సాహా (బి) అశ్విన్ 44, బ్లండెల్ (రనౌట్) 0, రచిన్ (సి) పుజారా (బి) జయంత్ 18, జెమీసన్ (ఎల్బీ) జయంత్ 0, సౌథీ (బి) జయంత్ 0, సోమర్విల్లె (సి) మయాంక్ (బి) జయంత్ 1, అజాజ్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 12, మొత్తం: 56.3 ఓవర్లలో 167 ఆలౌట్. వికెట్ల పతనం: 1-13, 2-45, 3-55, 4-128, 5-129, 6-162, 7-165, 8-165, 9-167, 10-167, బౌలింగ్: సిరాజ్ 5-2-13-0, అశ్విన్ 22.3-9-34-4, అక్షర్ 10-2-42-1, జయంత్ 14-4-49-5, ఉమేశ్ 5-1-19-0.